Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనుల జాప్యంపై అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం
- ఖరీఫ్నాటికి నీరివ్వాలి.. పనుల వేగం పెంచండి
- ప్రాజెక్టు పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్
- కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు
నవతెలంగాణ-మహదేవ్పూర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ పనుల జాప్యంపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్లను సందర్శించారు. పనుల నత్తనడకపై కాంట్రాక్టర్లు, ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజీ అయిన మేడిగడ్డ వద్ద అప్రోచ్ బంధం (కరకట్ట) పనులు ఇంకా పూర్తి చేయకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. కరకట్ట పనులు పూర్తి చేస్తేనే నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించుకోవాలన్నారు. లెఫ్ట్ బ్యాంక్ మహారాష్ట్ర వైపు ఇంకా 20 ఎకరాల స్థల సేకరణ ఎందుకు పూర్తి చేయలేదని అధికారులను ప్రశ్నించారు. జూన్ నెలలోగా బ్యారేజీ, కరకట్ట పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు కన్నెపల్లి పంప్హౌస్ను సందర్శించిన సీఎం మోటార్లు బిగింపు పనులు పూర్తి చేసి ట్రయల్రన్కు ముహూర్తం తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ మహారాష్ట్ర వైపు పనులను కరకట్ట పనులను రోడ్ మార్గాన వెళ్లి సందర్శించారు. బ్యారేజీలో పనిచేస్తున్న కార్మికులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎట్టి పరిస్థితులలో జూన్ నెలాఖరు వరకు పనులు పూర్తి చేసి ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి నీరు అందించాలని అదేశించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కె.జ్యోషి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, ఎమ్మెల్సీలు నారదాస్ లక్ష్మణ్రావు, బానుప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్, ఈఎన్పి నల్లా వెంకటేశ్వర్లు, మేడిగడ్డ బ్యారేజి ప్రాజెక్టు పిఎం రామకృష్ణరాజు, మేడిగడ్డ ఈఈ రమణరెడ్డి, అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
కాళేశ్వరం ఆలయ అభివృధ్ధికి రూ.100కోట్లు
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం కే.చంద్రశేఖర్రావు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన కేసీఆర్ దంపతులు ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ వారిని సన్మానించి మెమొంటో అందచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం ఆలయాన్ని మరో యాదాద్రిగా మార్చుతాననీ, త్వరలో శృంగేరి పీఠాధిపతి అదేశాల మేరకు దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాననీ అన్నారు. అర్చకులకు గృహ నిర్మాణం చేపడుతామని హామీనిచ్చారు. వందెకరాల భూమి సేకరించాలని దానిలో సత్రాలు, అర్చకుల వసతి గృహాలు, కళ్యాణ మండపం, యజ్ఞశాల, వేద పాఠశాలను నెలకొల్పుతామని అన్నారు. ఆలయంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతమంతా అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన భూమి సేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లను ఆదేశించారు. అనంతరం గోదావరి నదిలో పూజలు చేశారు.