Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తున్న బీజేపీ
- దేశాన్ని విభజించడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
- సంఘటిత ఉద్యమాలతోనే ప్రజాస్వామ్యం పరిరక్షణ
- సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడాలి:సుందరయ్య స్మారకోపన్యాసంలో ఐఐటీ ప్రొఫెసర్ రామ్ పునియాని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో మతోన్మాదం ప్రజాస్వామ్యానికే ముప్పు తెచ్చిపెడుతోందని ఐఐటీ ముంబై ప్రొఫెసర్ రామ్ పునియాని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తోందన్నారు. దేశాన్ని మతం పేరుతో విభజించి రాజకీయ లబ్ది పొందడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లక్ష్యమని చెప్పారు. సంఘటిత ఉద్యమాలతోనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లో పుచ్చలపల్లి సుందరయ్య 34వ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి రామ్ పునియాని పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం 'ప్రజాస్వామ్య పరిరక్షణ-నేటి తక్షణ కర్తవ్యం'అనే అంశంపై స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరని అన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వం సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రజాస్వామిక వ్యవస్థలో పునాదిగా ఉంటాయన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి ముగింపు పలుకుతోందని విమర్శించారు. ఐదేండ్ల కాలంలో ప్రజాస్వామిక విలువలు పతనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, సీబీఐ, ఆర్బీఐ, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నాయని చెప్పారు. బీజేపీ సర్కారు ఆ రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేసిందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. ప్రభుత్వంలో ప్రధానితోపాటు మంత్రులకూ అధికారాలుంటాయని చెప్పారు. కానీ ప్రధాని మోడీ అన్ని శాఖలకూ చెందిన నిర్ణయాలు తీసుకొంటూ ఏకవ్యక్తి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని పక్కనపెట్టి నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. హిందూ జాతీయవాదాన్ని భారత జాతీయవాదంగా చిత్రీకరించేందుకు ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తులు అనేక కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. రామమందిర నిర్మాణం, లవ్ జిహాద్, గో సంరక్షణ, ఘర్వాపసీ పేరుతో దాడులు చేస్తున్నాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావాలను వ్యతిరేకిస్తే దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. శ్రమతో కూడిన హిందూ సంప్రదాయాలను గౌరవించాలని అన్నారు. కానీ కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ శ్రమకు విలువలేని బ్రాహ్మణీయ సంప్రదాయాలను వ్యతిరేకించాలని చెప్పారు. హిందూ, ముస్లిం రాజులు కలిసుండేవారని గుర్తు చేశారు. కానీ ఏ రాజు సైన్యంలోనైనా హిందువులు, ముస్లిములుండేవారని అన్నారు. యుద్ధాలు అధికారం కోసం, డబ్బు కోసం జరిగాయన్నది చారిత్రక సత్యమని చెప్పారు. కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు మత మార్పిడి కోసం, హిందువులను బానిసలుగా చేయడం కోసం ముస్లిం రాజులు యుద్ధాలు చేశారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. స్వేచ్ఛను భగత్సింగ్, సమానత్వాన్ని అంబేద్కర్, సౌభ్రాతృత్వాన్ని గాంధీ కోరుకున్నారని చెప్పారు. కానీ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ నాయకులు బ్రిటీష్ నాయకుల విధానాలకు వత్తాసు పలికారని ఎద్దేవా చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం వంటివి రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అందించారని గుర్తు చేశారు. కానీ భారత రాజ్యాంగంలో పాశ్చాత్య విలువలున్నాయని ఆర్ఎస్ఎస్ నేత కె సుదర్శన్ వ్యాఖ్యానించారని చెప్పారు. బీజేపీ హయాంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అనేక సవాళ్లున్నాయని అన్నారు. దేశ ఐక్యత, జాతీయత గాంధీ, అంబేద్కర్, భగత్సింగ్ కోరుకుంటే దేశ విభజనను ఆర్ఎస్ఎస్ కోరుకుంటోందని చెప్పారు. హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ చూస్తోందన్నారు. హింసతోనే బీజేపీ బలం పెరిగిందని అన్నారు. సంఘటిత ఉద్యమాలు నిర్మించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని మతాలనూ గౌరవించాలని, మూఢవిశ్వాసాలను వ్యతిరేకించాలని అన్నారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలని, సమానత్వంతో జీవించాలని, శ్రమకు విలువ ఉండాలని చెప్పారు. అందరికీ సమానత్వం, అందరికీ సామాజిక న్యాయం అందే వరకూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీ గెలిస్తే మరింత ప్రమాదం : రాఘవులు
ప్రజాస్వామ్య ప్రమాదంలో ఉందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బివి రాఘవులు అన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఈ ఐదేండ్ల కాలంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం దీనికి ప్రధాన కారణమని అన్నారు. సమాజాన్ని బీజేపీ ప్రభుత్వం విషతుల్యం చేసిందన్నారు. ఈనెల 23 తర్వాత లౌకిక ప్రభుత్వం ఏర్పడినా ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం చేయాల్సిందేనని చెప్పారు. అశాస్త్రీయ భావాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలోకి వెళ్తుందన్నారు. ప్రశ్నించే వారిని, గో సంరక్షణ పేరుతో హత్యలు చేస్తూ అమెరికా, చైనాలాగా భారత్ సూపర్పవర్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆధునిక సమాజంగా కాకుండా ప్రాచీన సమాజంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. మతోన్మాదంపై పోరాటం చేయాలని ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మార్క్సిస్టు దృక్కోణం ఉండడం వల్లే సుందరయ్య నిరాడంబరంగా జీవించారని చెప్పారు. గొప్ప కమ్యూనిస్టు, అందరికీ ఆయన జీవితం ఆదర్శమని అన్నారు. ప్రకృతి నుంచి ఎంత తీసుకుంటున్నామో తిరిగి అంతే ఇవ్వాలని చెప్పారు. లేకపోతే సమాజంలో అనేక వైపరీత్యాలు వస్తాయన్నారు. భవిష్యత్తు తరాల గురించి, మానవాళి గురించి ఆలోచించేవారే కమ్యూనిస్టులని అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ మాట్లాడుతూ ఎస్వికె ట్రస్టు బహుముఖ కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. సేవా, సైద్ధాంతిక, భావజాల రంగంతోపాటు ఫిల్మ్స్కూల్, సాఫ్ట్వేర్ రంగంలోనూ విశేష కృషి చేస్తోందని వివరించారు. ఎస్వికె ఆధ్వర్యంలో జనరిక్ మెడిసిన్ హైదరాబాద్లోనే కాకుండా మహబూబ్నగర్లోనూ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య స్మారకోపన్యాసం చేసిన రామ్ పునియాను ఎస్ వినయకుమార్, తమ్మినేని వీరభద్రం, రాఘవులు ఈ సందర్భంగా సన్మానించారు.