Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) రాతపరీక్షల తేదీలను మార్చాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి కోట రమేష్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఈనెల 17 నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయని తెలిపారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న తేదీల్లోనే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీలు ఖరారయ్యాయని పేర్కొన్నారు.
దీంతో పీజీ ఎంట్రెన్స్ రాయాలనుకునే డిగ్రీ విద్యార్థులు అవకాశం కోల్పోయే ప్రమాదముందని తెలిపారు. అందువల్ల సీపీగెట్ పరీక్షల తేదీలను మార్చాలని కోరారు.
ఈనెల 30న ఓయూ పరిధిలో డిగ్రీ ఎకనామిక్స్ పరీక్ష ఉందని పేర్కొన్నారు. అదేరోజు హెచ్సీయూ పరిధిలో ఎకనామిక్స్ పీజీ ఎంట్రెన్స్ పరీక్ష ఉందని తెలిపారు. జూన్ 14న ఇతర విశ్వవిద్యాలయాల పీజీ ఎంట్రెన్స్ పరీక్షలున్నాయని పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి వైఫల్యం మూలంగా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు గందరగోళం మధ్య జరుగుతున్నాయని తెలిపారు. ఓవైపు ఎండల తీవ్రత తగ్గక ముందే సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని పేర్కొన్నారు. విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా పరీక్షలు నిర్వహించడం, వివిధ విశ్వవిద్యాలయాల పీజీ ప్రవేశ పరీక్షల తేదీలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం తేదీలు ఖరారు చేయడం విద్యార్థులకు నష్టమని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నత విద్యామండలి పునరాలోచించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.