Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్ భగీరథపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మిషన్ భగీరథకు సంబంధించి ఇప్పటి వరకూ 95 శాతం పనులు పూర్తయ్యాయని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా ఆంధ్రజ్యోతి పత్రిక నిరాధార వార్తలను ప్రచురిస్తోందని విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... భగీరథ కార్యక్రమంలో భాగంగా మొత్తం 18 వేల ట్యాంకులకుగాను 14 వేల ట్యాంకుల నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. మొత్తం కేటాయింపుల్లో రూ.వెయ్యి కోట్ల పనులే మిగిలాయని చెప్పారు. పెండింగ్లో ఉన్న బిల్లులు కేవలం రూ.600 కోట్లేనని తెలిపారు. గజ్వేల్ రింగు రోడ్డు పనుల విలువ 185 కోట్లని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అందులో రూ.112 కోట్ల పనులు పూర్తయ్యాయని వివరించారు. ఆర్ అండ్ బీ డిపార్టుమెంటుకు సంబంధించి రూ.7,100 కోట్ల పనులు పూర్తయ్యాయని, ఇందులో కేవలం రూ.600 కోట్ల బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి వాస్తవాలన్నింటినీ మరిచిన ఆంధ్రజ్యోతి పత్రిక... అవాస్తవాలను ప్రచురిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ పత్రికపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. టీఆర్ఎస్ తరపున ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.