Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అర్హులైన రైతులందరికీ కొత్తగా రుణాలివ్వాలని కోరింది. ఈ నెల 16 నుంచి 18 వరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన తెలంగాణ రైతు సంఘం ప్లీనరీ సమావేశంలో చేసిన తీర్మానాలను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయలలోపు రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి ఉంటుందని చెప్పారు. రుణమాఫీ చేయడం ద్వారా రైతులకు కొత్త రుణాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.బ్యాంకుల సహకార సంఘాలు ద్వారా ఆర్బీఐ నిబంధనల ప్రకారం మార్చి 31 నాటికి బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లలో 18 శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కోరారు. అన్ని రకాల భూములు సాగు చేస్తున్న రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. జంగారెడ్డి, ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, బొంతల చంద్రారెడ్డి, సహాయ కార్యదర్శి ఎం. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.