Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ గురుకులాలపై హిందూత్వ శక్తులు కుట్ర చేస్తున్నాయని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ విమర్శిం చింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి కోట రమేష్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురుకులాలపై ఆర్ఎస్ఎస్ అనుబంధ, అనుకూల సంస్థలు, వ్యక్తులు తప్పుడు ప్రచారాలతో, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను లక్ష్యంగా చేసుకొని సాగిస్తున్న కుట్ర పూరిత విధానాలను ఖండిస్తున్నామని తెలిపారు. కొంతకాలంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్ఎస్ఎస్ పనిగట్టుకొని మనువాద భావజాలంవైపు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే వివిధ రకాల తప్పుడు వాదనలు ముందుకుతెస్తూ వాటిని పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు చదువులను దూరం చేసే దురుద్దేశంతో ఈ కుట్రలు చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన విధానాల మీద ఆధారపడి పేదలకు ఉపయోగపడుతున్న వాటిని ఓర్వలేకనే ఆర్ఎస్ఎస్ అనుకూల సంస్థలు ఇలాంటి అబద్ధపు ప్రచారాలను చేస్తున్నాయని తెలిపారు. ఏనాడూ గురుకుల విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడని కొన్ని హిందూత్వ శక్తులు పనిగట్టుకొని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాయో ప్రజాస్వామికవాదులు గుర్తించాలని కోరారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో దళిత, బహుజన విద్యార్థులు, మహిళలు, ప్రజాస్వామికవాదులపై దళిత ఐఏఎస్, ఇతర అధికారులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడుల్లో భాగంగానే గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.