Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన అధికారి రజత్కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభవుతుందన్నారు. 17 లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 126 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్లో 7, సికింద్రాబాద్లో 6 సెగ్మెంట్లలో లెక్కింపు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు నిర్వహణపై బుధవారం ఆయన సచివాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుందన్నారు. ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుందని సీఈఓ చెప్పారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఉంటాయని.. నిజామాబాద్ పరిధిలో ప్రతి అసెంబ్లీ స్థానంలో 2 హాళ్లు, 36 టేబుళ్లు ఏర్పాటు చేశామని అన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో లాటరీ పద్దతిలో 5 వీవీ ప్యాట్ల ఎంపిక జరుగుతుందన్నారు. వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంలకు ఇప్పటివరకు తేడా రాలేదన్నారు. ఈవీఎంలు, 17సీలో సమానంగా వచ్చి వీవీప్యాట్ స్లిప్పులో తేడా వస్తే మరోసారి స్లిప్పుల లెక్కింపు చేపడతామన్నారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులో మానవ తప్పిదం జరగవచ్చునని అందువల్ల రెండు, మూడుసార్లు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తామన్నారు. రీకౌంటింగ్ కోసం అభ్యర్థి లేదా ఏజెంట్ ఆర్వోకు లిఖిత పూర్వక దరఖాస్తు చేయాలన్నారు. ఫలితాల వెల్లడిలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని ఆ విషయంలో ఈసీ జోక్యం చేసుకోదని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక్క ఓటుతో ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కౌంటింగ్లో 6,500 సిబ్బంది పాల్గొంటారని వివరించారు.