Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభ సభ ఎస్వీకేలో
- ఏడాదిపాటు నిర్వహణ : పాలడుగు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) ఆవిర్భవించి 50 ఏండ్లు అవుతున్న సందర్భంగా మే 30 నుంచి వచ్చే ఏడాది మే 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రకటించారు. స్వర్ణోత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్ను హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణలో స్వర్ణోత్సవాల సభ ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల ఎస్వీకేలో నిర్వహించనున్నట్టు, ఈ సభకు సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు తెలిపారు. వర్గదోపిడీ అంతానికి, సామాజిక మార్పు సాధన కోసం సీఐటీయూ నిరంతరం పోరాటాలు చేస్తున్నదని వివరించారు. స్వర్ణోత్సవాల సభల్లో బ్యాంక్, ఇన్సూరెన్స్, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, రైల్వే, సీజీ, పబ్లిక్ సెక్టార్, ఇండిస్టీయల్ సెక్టార్, కేంద్ర స్కీమ్ వర్కర్స్, అసంఘటిత తదితర రంగాల జాతీయ, రాష్ట్ర నేతలు పాల్గొంటారని తెలిపారు. మే 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండలాలు, పారిశ్రామిక కేంద్రాలు, సీఐటీయూ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో జెండావిష్కరణలు, సదస్సులు - సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపనున్నామని, కార్మికుల్లో వాల్పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సీఐటీయూ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం- కార్మికోద్యమ ఐక్యత సాధన కోసం సాగే ఈ స్వర్ణోత్సవాలలో రాష్ట్రంలోని యావత్ కార్మికవర్గం పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.రమ, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్, వీఎస్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న, శ్రీకాంత్ పాల్గొన్నారు.