Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కవోని దీక్షతో కార్మికవర్గానికి సేవ చేసిన పర్సా
- వర్థంతి సభలో నవతెలంగాణ సంపాదకులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ - హైదరాబాద్
తన చివరి శ్వాస దాకా ఆశయం కోసమే తపించిన గొప్ప కార్మికనేత పర్సా సత్యనారాయణ అని నవతెలంగాణ సంపాదకులు ఎస్.వీరయ్య నివాళులర్పించారు. మొక్కవోని దీక్షతో ఆయన కార్మికవర్గానికి సేవ చేశారని తెలిపారు. సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావంతో ప్రతి ఒక్కరూ సౌకర్యాల కోసం ఆరాటపడుతున్న ప్రస్తుత తరుణంలో పర్సా నిరాడంబరత నేటి తరానికి ఆదర్శనీయమని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో పర్సా సత్యనారాయణ నాలుగో వర్థంతి సభను నిర్వహించారు. పాలడుగు భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీరయ్య ముఖ్య అతిథిగా మాట్లాడుతూ సింగరేణి కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన పర్సా... అత్యంత నిర్బంధం మధ్య కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. కార్మికులను సంఘటిత పరిచేందుకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ క్రమంలోనే తన ఉద్యోగాన్ని సైతం కోల్పోయారని తెలిపారు. అయినా మొక్కవోని దీక్షతో కార్మికవర్గానికి సేవలందించారని చెప్పారు. కార్యకర్తలను అభివృద్ధి పరచటంలోనూ, వారికి తర్ఫీదునివ్వటంతోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారని గుర్తుచేశారు. రాజకీయ భూగోళం అనే అంశాన్ని బోధించటంలో ఆయన దిట్టని తెలిపారు. కార్మికలోకం పత్రికను తీసుకు రావటానికి, దాని సర్క్యులేషన్ పెంచటానికి ఆయన ఎనలేని కృషి చేశారని నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు పీఎస్ఎన్ మూర్తి, జె.వెంకటేశ్, ఎస్.రమ, విఎస్ రావు, వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎమ్వీ రమణ, మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, బీఎల్ఎఫ్ నాయకులు శ్రీరాం నాయక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాడిగల్ల భాస్కర్, స్కైలాబ్ బాబు, పీఎన్ఎమ్ రాష్ట్ర కార్యదర్శి కట్టా నర్సింహా తదితరులు పాల్గొన్నారు.