Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట జిల్లా లక్ష్మాపూర్లో ఘటన
నవతెలంగాణ- తొగుట
మల్లన్నసాగర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన తన ఇంటికి నష్టపరిహారం చెక్కు ఇవ్వలేదని నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం లక్ష్మాపూర్లో బుధవారం జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన లక్ష్మాపూర్కు చెందిన తిగుళ్ల రాజమణికి ఇద్దరు కుమార్తెలు, కూమారుడు ఉన్నారు. ఆమె భర్త 8 ఏండ్ల కిందటే అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇద్దరు కుమార్తెల పెండ్లిళ్లు చేసింది. అప్పుడు తెచ్చిన అప్పును మల్లన్నసాగర్లో వచ్చిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో తీర్చింది. కాగా బుధవారం కొంత మంది నిర్వాసితులకు ఇండ్లకు సంబంధించిన పరిహార చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. ఈ లిస్టులో తమ ఇంటికి సంబంధించిన పేరు లేకపోవడం, పరిహారం చెక్కు రాకపోవడంతో మనస్తాపానికి గురైన రాజమణి కుమారుడు శేఖర్ ఇంట్లో టార్పెంట్ ఆయిల్ తాగాడు. తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు శేఖర్ కోసం వెతుకుతున్నారు. ఇంతవరకూ ఆచూకీ లభించలేదని గ్రామస్తులు తెలిపారు.
చెక్కుల పంపిణీ అడ్డగింపు
నిర్వాసితులందరికీ ఒకేరకంగా పరిహారం ఇవ్వకుండా.. ఇంటికో విధంగా ఎలా ఇస్తారని సిద్దిపేట జిల్లా తొగుట మండలం లక్ష్మాపూర్ గ్రామస్తులు చెక్కుల పంపిణీని అడ్డుకున్నారు. మల్లన్నసాగర్ నిర్మాణంలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు బుధవారం నష్టపరిహార చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు గ్రామానికొచ్చారు. అయితే, పరిహారంలో వివక్ష చూపిస్తున్నారంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాసం, ఉపాధి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ గ్రామంలోనూ నిర్వాసితులకు న్యాయం చేయలేదన్నారు.