Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేములవాడలో ఇద్దరు, చింతలమానెపల్లిలో ఒకరి అరెస్ట్
- జిల్లాల్లో ఫర్టిలైజర్స్ దుకాణాల్లో తనిఖీలు
నవతెలంగాణ-సిరిసిల్ల/వేములవాడ/
చింతలమానెపల్లి
రాష్ట్ర వ్యాప్తంగా ఫర్టిలైజర్స్ దుకాణాల్లో బుధవారం అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల, కుమురం భీం జిల్లాల్లో నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు వచ్చాయన్న సమాచారంతో సీసీఎస్ పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందం వేములవాడలోని తిప్పాపూర్ రాజరాజేశ్వరి ఫర్టిలైజర్ దుకాణంపై బుధవారం దాడులు చేశారు. 130 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి నెల్లూరు నుంచి నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి వేములవాడ చుట్టుపక్కల గ్రామాల్లో రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. శ్రీనివాస్తోపాటు ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడు కొమురవెల్లి శివుడుని అరెస్టు చేసినట్టు తెలిపారు.
కుమురం బీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాబాసాగర్లో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ లచ్చన్న తెలిపిన వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారం మేరకు బాబాసాగర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. కొండు వెంకన్న ఇంట్లో నిల్వ ఉంచిన 140 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.లక్షా 12వేలు ఉంటుంది. అలాగే, మంగళవారం ఇదే మండలం గంగాపూర్లో కూడా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. గ్రామంలో నిల్వ ఉంచిన రూ.6లక్షల 9వేల విలువ గల 868 ప్యాకెట్లు, రూ.తొమ్మిది లక్ష్లల 60వేల విలువ గల ఆరు క్వింటాళ్ల లూజు పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా, బుధవారం పలు జిల్లాల్లో ఫర్టిలైజర్స్ దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని విత్తన దుకాణాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్ లైసెన్స్ రెన్యువల్ను, పత్తి విత్తనాల స్టాక్ను తనిఖీ చేశారు. రైతులు ఎవరైనా విత్తనాలు కొనేటప్పుడు లైసెన్స్ కలిగిన విత్తన దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేసి రసీదు పొందాలని సూచించారు. ఆలేరులో పోలీసులు, వ్యవసాయాధికారులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులు పోలీసులతో కలిసి విత్తన దుకాణాల్లో తనిఖీలు చేశారు.