Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గించి ఇచ్చేందుకు నిర్ణయం
- అలా అయితే.. ఖాళీ చేయబోమంటున్న బాధితులు
- 2013 చట్టం ప్రకారం ఇవ్వాలని డిమాండ్
- గ్రామాన్ని ఖాళీ చేయాలంటున్న సింగరేణి
- జగన్నాథపురం గిరిజనుల్లో ఆందోళన
నవతెలంగాణ- ఖమ్మం ప్రతినిధి
'పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల..' అని సినీ కవి రాసినట్టుగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని జగన్నాథపురం గ్రామం పరిస్థితి అచ్చు అలాగే ఉంది. ఓసీ-2 విస్తరణలో భాగంగా ఈ గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ సింగరేణి యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. అయితే, పరిహారం చెల్లింపు విషయంలో మెలికలు పెడుతోంది. అసలే, ఉన్న ఊరును, భూములను, పెంచుకున్న చెట్లను, నడయాడిన నేలను విడిచి వెళ్లడానికి కన్నీరు పెడుతున్న గిరిజనులకు.. పరిహారం విషయంలో సింగరేణి కిరికిరి పెడుతోంది. ఈ క్రమంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తేనే ఖాళీ చేస్తామంటూ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సత్తుపల్లి మండలం చెరుకుపల్లి రెవెన్యూ పరిధిలోని జగన్నాథపురంలో 1243 మంది జనాభా ఉంది. గ్రామంలో పట్టాభూములు 91ఎకరాలు, అసైన్మెంటు భూమి 171ఎకరాలు, చెరువు విస్తీర్ణం 14ఎకరాలు, అటవీ భూమి 1015 ఎకరాలు ఉంది. ప్రధాన పంటగా వరి సాగుచేస్తారు. ఈ గ్రామానికి అనుబంధంగా మొద్దుల చెరువు, పెద్దమ్మకుంట, పైద బొర్రయ్యకుంట చెరువులున్నాయి. వీటిని సింగరేణి సంస్థ తమ ఓసీ విస్తరణకు తీసుకోవడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకుంది. పరిహరం విషయంలో ఖమ్మం జిల్లా సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. కానీ ముందు చెప్పినట్టు కాకుండా తగ్గించి ఇస్తామనడంతో గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు.
పరిహారంలో కిరికిరి..
గృహనిర్మాణం కోసం రూ.5,04,000, మరో రూ.5లక్షలు నగదు రూపంలో, జీవనాధార భృతి నెలకు రూ.3వేల చొప్పున 12నెలలకు గాను అదనపు ఖర్చు కలుపు కుని రూ.40వేలు చెల్లిస్తామని సింగరేణి యాజమాన్యం చెప్పింది. దాంతోపాటు రవాణా భత్యం రూ.60వేలు, ఏకమొత్తంగా ఇచ్చే పునరుపాధి పరిహారం రూ.60,000 కలుపుకుని మొత్తం రూ.11,64,000 చెల్లిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు అందులో రూ.5లక్షలు తగ్గించి ఇస్తామం టోంది. అదేమంటే, ఇండ్లను తామే కట్టించి ఇస్తామని, అందుకే తగ్గిస్తున్నామంటూ ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాక వ్యవసాయ భూముల విలువ ప్రస్తుతం ఎకరానికి రూ.25లక్షలుగా ఉంటే రూ.16.50 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధపడుతోంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఇండ్లల్లోని పెద్దపెద్ద చెట్లకూ, దుకాణాల నిర్మాణాలకు ఇవ్వాల్సిన పరిహారం రూ.25వేలు తగ్గించి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం మొత్తాన్ని పదేండ్ల వరకు కాకుండా ఏకమొత్తంలో ఇవ్వకపోతే తాము ఊరు విడిచి వెళ్లబోమని తెగేసి చెబుతున్నారు. ఇండ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి ఐదు నుంచి పది గుంటల భూమి ఇవ్వాలని కోరుతున్నారు.
కన్నీళ్లు వస్తున్నాయి
ఊరిడిసి వెళ్లాలని చెప్పారు. ఇప్పటికే గ్రామంలో అన్ని పనులూ నిలిచిపో యాయి. ఓనమాలు నేర్చుకున్న పాఠశాల, స్నేహితులతో కలిసి తిరిగిన ఊరును వదిలి వెళ్లాలంటే కన్నీళ్లు వస్తున్నాయి. వ్యవసాయ భూములు, పెంచుకున్న చెట్లను వదిలివెళ్లాల్సి వస్తోంది.
- సున్నం గణేష్, ఇంటర్ విద్యార్థి
ఇండ్ల స్థలాలకు
ఎంతిస్తారో స్పష్టం చేయాలి
ఇంటి స్థలానికి ఎంతిస్తారో తెలియడం లేదు. ఇంటి స్థలం మొత్తానికి కాకుండా గుంటల్లెక్క పరిహారం ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఇండ్లల్లో పెంచుకున్న చెట్లకు పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పుడు లేదంటున్నారు. మాకు అన్యాయం చేస్తే ఖాళీ చేసేదిలేదు.
- పైద ఆదెమ్మ
గ్రామస్తులు ముందుకు రాలేదు
జగన్నాథపురంలో పరిహారం విషయంలో గ్రామస్తులు ఒప్పుకోవడం లేదు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సబ్కలెక్టర్ల సమక్షంలో చెక్కులు తీసుకోవడానికి ముందుకు రాలేదు. వారితో చర్చలు జరుపుతున్నాం. పరిహారం విషయంలో ఎస్డీసీ, సింగరేణి అధికారులు పరిశీలిస్తున్నారు.
- విజయకుమార్, సత్తుపల్లి తహసీల్దార్
ప్యాకేజీ అంతా ఒకే విడత ఇవ్వాలి
గ్రామాన్ని ఖాళీ చేయాలని చెబుతూనే మరోపక్క పరిహారం విషయంలో అన్యా యం చేసే కుట్రలు జరుగుతు న్నాయి. తొలుత ఒక్కో ఇంటికి రూ.11.64లక్షలు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. తీరా ఖాళీ చేసే సమయంలో రూ.6.64లక్షలే చెల్లిస్తా మని, మిగతా నిధులతో ఇల్లు కట్టిస్తామని చెప్పటం అన్యాయం. ఒకేసారి ఇవ్వక పోతే ఖాళీ చేయం.
- ఊకె వెంకటేశ్వరరావు