Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు ప్రారంభం
- 10న తొలివిడత సీట్ల కేటాయింపు
- ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను బట్టి ప్రత్యేక విడత
- జులై 1 నుంచి డిగ్రీ తరగతులు : విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్రెడ్డి
- దోస్త్ నోటిఫికేసన్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సులువుగా రిజిస్ట్రేషన్ చేసేందుకు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు అధికా రులు 'దోస్త్' మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉన్న విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు అవకాశముంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కాలేజీలో చేరే వరకూ పూర్తిగా మొబైల్ ఫోన్ చేసేందుకు వీలుగా టెక్నాలజీని రూపొందించారు. దోస్త్ మొబైల్ యాప్ గురువారం నుంచి విద్యార్థులకు అందు బాటులోకి రానుంది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాల యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడి యాతో మాట్లాడుతూ గురువారం నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. వచ్చేనెల 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువుందని అన్నారు. ఈనెల 25 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 200 ఉంటుందని అన్నారు. ఆలస్య రుసుం రూ.400తో వచ్చేనెల 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. వచ్చేనెల 10న తొలివిడత సీట్లు కేటాయిస్తామని వివరించారు. వచ్చేనెల 10 నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో సెల్ఫ్రిపోర్టింగ్ సిస్టం ఆధారంగా కేటాయించిన కాలేజీల్లో చేరాలని అన్నారు. వచ్చేనెల 10 నుంచి రెండోవిడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. పూర్తి వివరాలకు ష్ట్ర్్జూ://సశీర్.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను బట్టి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ చేపడతామని చెప్పారు. విద్యార్థులకు నష్టం కలిగించబోమని, అందరికీ అవకాశాలు కల్పిస్తామని అన్నారు.
పాత పది జిల్లాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు : లింబాద్రి
పాత పది జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి చెప్పారు. గతేడాది ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీలోనే ప్రత్యేక సహాయ కేంద్రం అందుబాటులో ఉండేదని అన్నారు. దీంతో విద్యార్థు లు సమస్యలు పరిష్కరించుకునేందుకు హైదరాబాద్ రావాల్సి వచ్చిందన్నారు. అందుకే పాత పది జిల్లాల్లో పది ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఏ సమస్య వచ్చినా విద్యార్థులు అక్కడికి వెళ్లొచ్చని సూచించారు. బయోమెట్రిక్, మొబైల్ ఫోన్, కోర్సులు మార్పు ఇలా ఏ సమస్య తలెత్తినా ప్రత్యేక సహాయ కేంద్రాలకు వెళ్లాలని కోరారు. మెరిట్, రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈసేవ, మీసేవతోపాటు ఆధార్తో అనుసంధా నమైన మొబైల్ ఫోన్లు, 92 సహాయ కేంద్రాలను దోస్త్ రిజి స్ట్రేషన్ల కోసం ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు కాలేజీ లకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లోనే సీటు రిజర్వు చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్లు జిరాక్స్ ప్రతులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ధ్రువపత్రాల పరిశీలన సయమంలోనే స్కానింగ్ చేస్తామన్నారు. ఇంటర్ ఫలితాల ఆధారంగా దోస్త్ షెడ్యూల్ను సవరిస్తామని చెప్పారు.
యాజమాన్య కోటాపై ప్రభుత్వానికి నివేదిస్తాం : పాపిరెడ్డి
ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సీఎం, విద్యామంత్రిని కలవలేదని చెప్పారు. కోడ్ ముగిసిన తర్వాత విద్యామంత్రిని కలిసి యాజమాన్య కోటా అంశాన్ని వివరిస్తామని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా నడుచుకుంటామని చెప్పారు. డిగ్రీ కోర్సులకు అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో కామన్ ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చాక ఒక్క డిగ్రీ కాలేజీకీ అనుమతి ఇవ్వలేదని అన్నారు. భవిష్యత్తులో ఇచ్చే అవకాశమూ లేదన్నారు. యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ కాలేజీలు ప్రత్యేకమైనవని అన్నారు. అందుకే జేఎన్ఏఎఫ్ఏయూ మూడేండ్ల కోర్సుకు అనుబంధ గుర్తింపు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.