Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటు కౌలు.. ఇటు పెట్టుబడి
- ఎకరం కౌలు రూ.15వేలు.. పెట్టుబడి రూ.32 వేలు
- వర్తించని రైతుబంధు, బీమా
నవతెలంగాణ-జనగామ ప్రతినిధి
కౌలు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అటు కౌటు..ఇటు పెట్టుబడి కౌలు రైతును కుంగదీస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా వారికి వర్తించడం లేదు. ఎకరం కౌలు రూ.15వేలు కాగా పెట్టుబడికి మరో రూ.32 వేలు ఖర్చు చేయాల్సొస్తోంది. పంట అమ్మాక అన్నీ పోను రెక్కల కష్టంతో కలుపుకుని 20 వేలు కూడా మిగలని పరిస్థితి. గతంలో ఉన్న కౌలు రైతుల గుర్తింపు కార్డులను తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అసలే ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందక.. ప్రయివేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగి.. కుటుంబాలు గడవక.. చివరకు కౌలు రైతులు భూముల్ని వదిలి పట్టణాలకు పయనమవుతున్నారు. భవన నిర్మాణ, అడ్డాకూలీలుగా మారుతున్నారు.
తెలంగాణలో వ్యవసాయదారులు 31లక్షల 51వేల 389 మంది ఉన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడే కూలీలు 59లక్షల 15వేల 151 మంది ఉన్నారు. కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షలు ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష మంది వరకు ఉన్నారు. గుర్తింపు కార్డులు జారీ చేసిన సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో 2014లో అధికారికంగా గుర్తించింది 48వేల మందిని.
బ్యాంకు రుణాలేవీ..
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్రెడ్డి కాలంలో కౌలు రైతుల సర్వే జరిగింది. గుర్తింపు కార్డులు జారీ చేశారు. బ్యాంకు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. అయితే, పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన వారు అప్పటికే రుణాలు తీసుకోవడంతో బ్యాంకర్లు ఒకే భూమిపై ఇద్దరికి రుణాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్లు కొన్ని బ్యాంకుల్ని ఒప్పించి రుణం ఇచ్చే విధంగా ప్రయత్నించారు. ఆ తర్వాత నుంచి బ్యాంకులు రుణాలు.. ప్రభుత్వం గుర్తింపు కార్డులూ ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల కోసం ఎకరాకు నాలుగువేల ఆర్థికసాయం ప్రకటించింది. ఇప్పుడు ఐదువేలు ఇస్తోంది. అందులో కౌలు రైతులను చేర్చలేదు.
పెరిగినపెట్టుబడులు
మంగపేట మండలం ముత్తబోయిన రమేష్ మూడున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఎకరం కౌలు ఖరీఫ్లో 15వేలు, రబీలో 10వేలు. అంటే రూ.25 వేలు. నాటు కూలి, విత్తనాలు, కలుపుకూళ్లు, ఎరువులు, కోత మిషన్ ఖర్చు ఇలా ఎకరాకు రూ.32వేలు ఖర్చు వస్తోంది. మంగపేటకు చెందిన శానం నవీన్కు రెండు ఎకరాల సొంత భూమి ఉండగా మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నాడు. కౌలు ముందే చెల్లించడంతో పాటు పెట్టుబడికి అప్పులు తేవాల్సి వస్తోందని తెలిపాడు.
వర్తించని రైతుబంధు, బీమా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు, బీమా కౌలు రైతులు, పోడు రైతులకు వర్తించడం లేదు. భూమిని కౌలుదారుడు సాగు చేస్తుంటే పెట్టుబడి సాయం మాత్రం హక్కుదారుడికి ఇస్తున్నారు. కౌలు రైతులు ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. రైతు బీమా కూడా వర్తించకపోవడంతో చనిపోయినా ఆ కుటుంబం ప్రభుత్వ సాయానికి నోచుకోని పరిస్థితి.
పెట్టుబడి సాయం అందించాలి
కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించ డంతో పాటు రైతు బీమాను వర్తింపజేయాలి. తాను నాలుగెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. కౌలు, పెట్టుబడికి అప్పులు చేస్తున్నాం. పంట విక్రయిచిన తరువాత వచ్చిన డబ్బులు పెట్టుబడులకే సరిపో వడం లేదు.
- ముత్తబోయిన రమేష్- రైతు,మంగపేట
కౌలు రైతుకు కార్డులు, రుణాలివ్వాలి
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు బ్యాంకు రుణాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉంది. కార్డులు లేకపోవడంతో పంటలకు బీమా చేయించక నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా జరిగిన పంట నష్టానికి పరిహారం అంద డం లేదు. కౌలు రైతులకు కూడా రైతుబంధు, బీమా వర్తింపజేయాలి.
-రమేష్, కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు