Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య ఉద్యమాలకు సిద్ధం కండి : బస్భవన్ వద్ద ఎస్డబ్ల్యూఎఫ్ ధర్నాలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వేతన సవరణ, డీఏ బకాయిలు, పనిభారాల తగ్గింపు, కనీస వసతులు, ఆర్టీసీ పరిరక్షణ, తార్నాక ఆస్పత్రి ఆధునీకరణ, బడ్జెట్లో 1శాతం నిధుల కేటాయింపు వంటి సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఎమ్డీ కార్యాలయం బస్భవన్ వద్ద పెద్ద సంఖ్యలో కార్మికులు నినాదాలు చేస్తూ తమ సమస్యల పట్ల యాజమాన్య, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఇక ఉపేక్షించేది లేదని, తాడో పేడో తేల్చుకుంటామని తేల్చిచెప్పారు. సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఎన్నికలు అడ్డంకి కాదని స్పష్టం చేశారు. ఎస్డబ్ల్యుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ రాంచందర్ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఆర్ సుధాభాస్కర్ ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాల కోసం పోరాటాలు, ఆ తర్వాత వాటిని అమలు చేయమని మళ్లీ ఆందోళనలు చేయాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లు అత్యంత క్లిష్టమైనవని, గడచిన ఐదేండ్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిందని విమర్శించారు. ఆర్టీసీ బస్సులకు కొత్త టైర్లు, రిమ్ములు, స్పేర్పార్ట్స్ వేయాలని డిమాండ్ల జాబితాలో చేర్చడమంటేనే...ఆర్టీసీ నిర్వహణ, ప్రభుత్వ బాధ్యత ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధమౌతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిగిలిన కార్మిక సంఘాలు కూడా దీనికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. టీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలు కారణమే తప్ప కార్మికులు ఎంతమాత్రం కాదని స్పష్టంచేశారు. దీనిపై యాజమాన్యం, ప్రభుత్వంతో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. 27 నెలలు గడచినా ఇప్పటి వరకు పేస్కేల్ ఎందుకు సాధించలేకపోయారో గుర్తింపు కార్మిక సంఘం కార్మికులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల వేతనాల కోసం రూ.240 కోట్లకు మించి ఖర్చు కాదని, కానీ దానిలో నగదుగా కార్మికులకు అందుతోంది కేవలం రూ.100 కోట్లు మాత్రమేనని, మిగిలిన సొమ్మంతా లోన్లు, ఇతర రుణాల పేరుతో యాజమాన్యం వద్దే ఉంటున్నాయన్న వాస్తవాన్ని విస్మరించరాదన్నారు. పనిభారాలు పెరిగి స్టీరింగ్స్ మీదే కార్మికులు ప్రాణాలు వదులుతున్నారని, 8 గంటల చట్టబద్ధ పనిగంటల్ని ఇప్పుడు 16 నుంచి 20 గంటలకు పెంచారని తెలిపారు. దుర్మార్గమైన రెగ్యులైజేషన్స్ను అమలు చేస్తూ, కార్మికులను వేధిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంత సర్వీసుల నష్టాలను భరిస్తామని 2014లో అప్పటి రవాణాశాఖ మంత్రి అంగీకరించారని, కానీ ఇప్పటి వరకు అది అమల్లోకి రాలేదని గుర్తుచేశారు.
8 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరగాల్సిన ఆర్టీసీ బస్సులు 23 లక్షల కి.మీ., వరకు తిరుగుతున్నాయని, ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. తార్నాక ఆస్పత్రిలో కనీసం బీపీ బిళ్లలు కూడా దొరకట్లేదని, పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేసి ఏటా రూ.60 కోట్లకు పైగా కార్పొరేట్ ఆసుపత్రులకు దోచిపెడుతున్నారని చెప్పారు. కేవలం రూ.100 కోట్లు ఒక్కసారి ఖర్చుపెడితే తార్నాక ఆస్పత్రే కార్పొరేట్ ఆస్పత్రిగా మారుతుందని, కమీషన్లకు కక్కుర్తిపడి పాలకులు దీన్ని విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో మహిళా ఉద్యోగులు, కండక్టర్లకు కనీస సౌకర్యాలు కూడా లేవని, వారు పడుతున్న బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం, పాలకులు కళ్ళుండీ ఎందుకు చూడలేకపోతున్నారని ప్రశ్నించారు. అంతకుముందు ఎస్డబ్ల్యూఎఫ్ ప్రచార కార్యదర్శి సీహెచ్ రాంచందర్, కార్యదర్శులు పీ రవీందర్రెడ్డి, లింగమూర్తి, ఏవీ రావు, గంగాధర్, వీరాంజనేయులు తదితరులు ఇన్చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.