Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి దయాకర్రావు
- వారం, పది రోజుల్లో సర్పంచ్లకు చెక్పవర్ ఇస్తామని హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిషన్ భగీరథకు కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇంటింటికి శుద్దమైన తాగునీటిని అందించే విషయంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జులై 15 నాటికి అన్ని రకాల పనులు పూర్తి చేయాలని ఆ తరువాత రాష్ట్రంలో ఎక్కడా నీటి సరఫరాలో అవాంతరాలు ఉండనాదపి స్పష్టం చేశారు. వారంపది రోజుల్లో సర్పంచ్ లకు చెక్ పవర్, అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజినీర్లు, కన్సల్టెంట్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సమీక్ష చేస్తూ జిల్లాలు, సెగ్మెంట్లు వారీగా పనుల తీరును తెలుసుకున్నారు. రోజువారీ నీటి సరఫరా, ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రామాల్లో అంతర్గత నీటి సరాఫరా పనులపై ఆరా తీశారు. ''మిషన్ భగీరథ పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మీ అందరి పని తీరువల్లే ఇది సాధ్యమైంది. మిగిలిన ఉన్న కొంచెం పనులను జూలై 15 లోపు పూర్తి చేసి ఇంకా మంచిపేరు తెచ్చుకోవాలి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఎంతో గొప్పది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇదే. నా 33 ఏండ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా. ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా బిందెలు, కుండలతో నీళ్ల కోసం మహిళలు ఎదురుపడేవారు. మిషన్ భగీరథతో ఇలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రతీ గ్రామంలో తాగునీటి సరాఫరా విషయంలో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది. గ్రామాల్లో పాత వాటర్ ట్యాంకుల మరమ్మత్తులు పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు అంగన్వాడీలకు కచ్చితంగా భగీరథ నీటి సరఫరా చేయాలని కోరారు. పథకం అవసరాల కోసం ప్రతీరోజూ 0.16 టీఎంసీల నీరు సరఫరా చేయాల్సి ఉంటుంది .ప్రస్తుతం 0.12 టీఎంసీలు మాత్రమే సరఫరా చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథతో 23968 ఆవాసాల్లోని 55,59,172 ఇండ్లకు తాగునీరు సరఫరా చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 22,210 ఆవాసాల్లోని 49,09,072 ఇండ్లకు నల్లాతో ప్రతిరోజు తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. మిగిలిన 1758 ఆవాసాల్లోని ఇంటింటికి కూడా త్వరలోనే నల్లాతో తాగునీటిని అందిస్తామని, నీటి కోసం పరిశ్రమల నుంచి కూడా చాలా విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు.