Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు జిల్లాల్లో తనిఖీలు
- ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు
నవతెలంగాణ-యంత్రాంగం
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం టాస్క్ఫోర్స్, వ్యవసాయశాఖ, పోలీసు అధికారులు భారీగా నకలీ పత్తి విత్తనాలను శుక్రవారం భారీగా పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో 1250 ప్యాకెట్టు, వికారాబాద్ జిల్లా బొంరాస్పేట్ మండలంలో నాలుగు టన్నులు, జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో ఆరు క్వింటాళ్లు, సంగారెడ్డి జిల్లా ధరూర్ మండలంలో నాలుగు క్వింటాళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలను పక్కా సమాచారం మేరకు విజిలెన్స్, వ్యవసాయ శాఖ, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అమృత్రెడ్డి వివరాల ప్రకారం.. ఇచ్చోడకు చెందిన డీలర్ గంగాధర్ గుజరాత్ నుంచి నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలు తెప్పిస్తున్నట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేది, కరీంనగర్ యూనిట్ అడిషనల్ ఎస్పీ జె.రామారావు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. దీంతో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అమృత్రెడ్డి, విజిలెన్స్ తహశీల్దార్ దినేష్రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ పులయ్య, ఏఓ కైలాష్, ఏఈఓలు ఉదరు కిరణ్, అనుదీప్రెడ్డి బృందంగా ఏర్పడి నిఘా పెట్టి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గురువారం ఇచ్చోడ బస్టాండ్ ప్రాంతంలో సాయికృప ట్రేడర్స్కు చెందిన గంగాధర్ గుజరాత్ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ ద్వారా శ్రీకాంత్ కంపెనీ పేరిట నకిలీ వ్యాపార సంస్థను సృష్టించి రవికాంత్, మునీం సుధాకర్ సాయంతో నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాల దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. శుక్రవారం ఆదిలాబాద్కు తీసుకొచ్చే క్రమంలో ఇచ్చోడ బైపాస్ వద్ద ఆ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 13 గన్నీ బ్యాగుల్లో 1250 ప్యాకెట్లు లభించాయి. ఒక్కో ప్యాకెట్ రూ.2వేలకు విక్రయిస్తుండగా, దీని విలువ రూ. 25 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. గంగాధర్ ఇప్పటికే గత ఏప్రిల్, మే నెలల్లో 2520 కిలోల (5600) ప్యాకెట్ల విత్తనాలను దిగుమతి చేసుకొని ఇచ్చోడ, నార్నూర్, మరికొన్ని మండలాల్లో సరఫరా చేసినట్టు విచారణలో తేల్చారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో వ్యాపారితోపాటు సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఏప్రిల్, మే నెలలో విక్రయించిన విత్తనాలతోపాటు ఇప్పుడు పట్టుబడిన విత్తనాల విలువ రూ. 1.12 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎవరైనా గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు విక్రయిస్తే కొనుగోలు చేయొద్దని సూచించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలంలోని గుడ్డందొడ్డి గ్రామంలో నాలుగు క్వింటాళ్ల యాభై కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్టు ఏఓ శ్రీలతా తెలిపారు. గ్రామంలోని భీమన్న, ఆంజనేయులు ఇండ్లల్లో నకిలీ విత్తనాలు ఉన్నాయన్న సమాచారం తెలుసుకుని పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో భీమన్న వద్ద మూడు క్వింటాళ్ల 80 కిలోలు, కుర్ర ఆంజనేయులు వద్ద 70 కిలోల చొప్పున మొత్తం నాలుగు క్వింటాళ్ల 50కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటిని నిల్వ ఉంచిన వారిద్దరిపై నమోదు చేసినట్టు ఎస్ఐ రాములు తెలిపారు.
వికారాబాద్ జిల్లా బోంరాస్పేట్ మండలం ఆల్లిఖాన్పల్లిలో ఒంగోలుకు చెందిన సురేష్, నెల్లూరుకు చెందిన రసూల్లు ఈ నెల 10న కర్నాటకలోని గుజారగడ్, ముదేలి ప్రాంతాల నుంచి నాలుగు టన్నుల 428 కేజీల నకిలీ పత్తి విత్తనాలను సూర్యాపేట జిల్లాకు తరలిస్తున్నారు.
బోంరాస్పేట్ మండలం దుద్యాల గేట్ సమీపంలో పోలీసులు తనిఖీల్లో పత్తి విత్తనాలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విత్తనాల సుమారు రూ. 71.85 లక్షల వరకు విలువ ఉంటుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నాగేశ్వర్రావు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలంలోని తుపత్రాల గ్రామంలో కుర్వ రాగవేంద్ర ఇంటిలో టాస్క్ఫోర్, వ్యవసాయాధికారి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆరు క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు ఏఓ శంకర్లాల్ తెలిపారు. వీటిలో రాఘవేంద్ర ఇంట్లో 80 కిలోలు, కుర్వ మల్లారెడ్డి ఇంట్లో క్వింటాల్ 20కిలోల విత్తనాలు పట్టుబడ్డట్టు తెలిపారు.