Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు యోచన
- ఆర్థికశాఖ కసరత్తులు
- ఓటాన్ అకౌంట్ కంటే రూ.10 వేల కోట్లు అదనం..?
- 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు తాత్కాలిక బడ్జెట్నే ప్రతిపాదించింది. ఎన్నికల అనంతరం రెండోసారి కొలువుదీరిన మోడీ సర్కారు... జులై 5న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చేనెల్లో రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తులు ప్రారంభించింది. గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటాన్ అకౌంట్ను ప్రతిపాదించారు. ఈసారి అదనంగా మరో రూ.10 వేల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్కు రూపకల్పన చేయబోతున్నారని సమాచారం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ బడ్జెట్లోనూ సాగునీటి పారుదల ప్రాజెక్టులకే అధికంగా నిధులు కేటాయిస్తూ వచ్చారు. జులైలో ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్లో కూడా ఆ రంగానికే పెద్ద పీట వేయబోతున్నారని అధికారులు చెబుతున్నారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం.. అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నులు, నిధులు, రాయితీలు తదితరాంశాలను బేరీజు వేసుకుని బడ్జెట్కు తుది రూపు ఇవ్వనున్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు ఇప్పుడున్న రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను మార్చి వాటిని కొత్తగా
రూపొందించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టాలను కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదింపజేయాలని సర్కారు భావిస్తున్నది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీకాలం వచ్చే నెలతో ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త చట్టాల ప్రకారమే వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఈనెల్లో ఒకట్రెండు రోజులపాటు అసెంబ్లీని సమావేశపరిచి.. వాటిని ఆమోదించే అవకాశమున్నట్టు సమాచారం. ఈనెల 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగే ఈ భేటీలో ఈ అంశాలన్నింటిపై చర్చించనున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి.