Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యుల నిర్లక్ష్యం ఘటనపై కమిషనర్ చర్యలు
- కాంట్రాక్టు వైద్యురాలు, ఇద్దరు నర్సుల తొలగింపు
- రెగ్యులర్ నర్సు సరెండర్
- ఆందోళనకు దిగిన సిబ్బంది
- చర్యలను తాత్కాలికంగా నిలిపేసిన కలెక్టర్
నవతెలంగాణ - ఖమ్మంటౌన్
ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగులపై వేటుపై అలజడి చెలరేగింది. ఇటీవల బాలింతలకు సేవలందించే విషయంలో వైద్యుల నిర్లక్ష్యంపై వెలువడిన కథనాల వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ యోగితా రాణా చర్యలు తీసుకున్నారు. కాంట్రాక్టు వైద్యురాలు, ఇద్దరు నర్సులు, రెగ్యులర్ నర్సుపై చర్యలకు ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ.. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆస్పత్రి సిబ్బంది పెద్దాస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో చర్యలపై అధికార యంత్రాంగం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.
మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో బాలింతలకు సేవలందించే విషయంలో వైద్య సిబ్బంది అలసత్వం ప్రదర్శించిన ఘటనపై వెలువడిన కథనాల ఆధారంగా ఆ శాఖ విజిలెన్స్ అధికారి రాజశేఖర్బాబు విచారణ నిర్వహించారు. కమిషనర్కు నివేదిక అందించారు. ఆ నివేదిక ఆధారంగా యోగితా రాణా తాజా చర్యలకు ఉపక్రమించారు. కాంట్రాక్టు వైద్యురాలు, ఇద్దరు కాంట్రాక్టు నర్సుల తొలగింపు, రెగ్యులర్ నర్సు డిప్యూటేషన్ను రద్దు చేస్తూ సరెండర్ కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ.. ఆస్పత్రి వైద్యులు, నర్సులు, ఉద్యోగులు పెద్దాస్పత్రి ప్రధాన ద్వారం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా టీఎన్జీవోస్, టీజీవో, ప్రభుత్వ వైద్యుల సంఘం ఇతర వైద్య ఉద్యోగ సంఘాల నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, పొట్టపెంజర రామయ్య, డాక్టర్ బి.శ్రీనివాసరావు, డాక్టర్ రవి, తాళ్లూరి రాజశేఖర్ ఆందోళనలో పాల్గొన్నారు. ఉన్నతాధికారుల చర్యలు అప్రజాస్వామికమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి అనేక అవార్డు లు రావడం వెనుక ఉద్యోగుల శ్రమ ఎంతో ఉందన్నారు. వైద్యురాలు, నర్సుల పై చర్యలు తీసుకునే విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పెరిగిన పని భారానికి అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. తక్షణమే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
డీఆర్వో చర్చలు
సెలవులో ఉన్న కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ దృష్టికి విషయం వెళ్లింది. వైద్య ఉద్యోగుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆస్పత్రికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని డీఆర్వో శిరీషను ఆదేశించారు. దీంతో ఆమె వెంటనే అక్కడికి చేరుకుని వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో చర్చించారు. కలెక్టర్ ఆందుబాటులో లేనందున.. ఆయన ఆదేశానుసారం ఉత్తర్వుల అమలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం వైద్యురాలు, నర్సులు యథావిధిగా విధుల్లో కొనసాగవచ్చని సూచించారు. సోమవారం కలెక్టర్ వచ్చిన తర్వాత ఉత్తర్వులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు.