Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేర సంబంధిత అంశాల పుకార్లపై అధికారుల గుర్రు
- అసత్య ప్రచారాలు చేసే ఖాతాదారులపై కఠిన చర్యలు : డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో వస్తున్న వార్తలు, మెసేజ్లు, పోస్ట్లు పోలీసు అధికారులకు తలనొప్పిగా మారాయి. పుంఖాను పుంఖాలుగా వచ్చి పడుతున్న నేర సంబంధిత సమాచారాలలో ఏది నిజం, ఏది అబద్దమో తెలియని స్థితిలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. కాగా, వీటిని ఎలా కట్టడి చేయాలనే దిశగా పోలీసు ఉన్నతాధికారులు తీవ్రం మల్లగుల్లాలు పడుతున్నారు. ఒక రోజు దొంగలు తిరుగుతున్నారని, మరో రోజు కిడ్నాపర్లు స్వైరవిహారం చేస్తున్నారని, ఇంకో రోజు పిల్లల్ని ఎత్తుకు పోయే గ్యాంగులు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేజ్బుక్లలో వస్తున్న వార్తలు, పోస్టింగ్లు ఇట్టే కొన్ని వందల సెల్ఫోన్లకు పాకిపోతున్నాయి. దీంతో వాటిని చూసిన ప్రజలు తీవ్ర భయాందోలనకు గురి కావడమే గాక ఇందులో ఏది నిజమనేది తెలియక ఆందోళనలకు గురి అవుతున్నారని తెలిసింది. ఇంకొందరు ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చి వెంటనే తమ గ్రామం, కాలనీ, బస్తీలలో గస్తీని పెంచాలని, దుండగుల నుంచి తమను కాపాడాలంటు పోలీసు స్టేషన్లకు ఫోన్లు చేసి సహాయాన్ని కోరుతున్నారు. గత ఏడు మాసాల క్రితం పిల్లల్ని ఎత్తుకు పోయే గ్యాంగ్ తిరుగుతున్నదని, ముఖ్యంగా చెడ్డి గ్యాంగ్గా పిలువబడే ఈ ముఠా సభ్యులు చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి దారుణంగా హత మారుస్తున్నారంటు పుకార్లు చెలరేగాయి. మొదట ఏపీలోని కర్నూలు జిల్లాలో మొదలైన ఈ పుకార్లు తర్వాత తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, సూర్యపేట్ తదితర జిల్లాలకు పాకింది. దీంతో అర్థరాత్రి వేళ తమ గ్రామాలు లేదా బస్తీలు, కాలనీలలో గస్తీ తిరిగిన స్థానిక ప్రజలు ఎవరైనా ఆగంతకులు కనిపిస్తే చాలు వారిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడులలో నలుగురు వ్యక్తులు వేరు వేరు ప్రాంతాలలో మరణించారు. కాగా పిల్లల్ని ఎత్తుకు పోయే ముఠాలు తిరుగుతున్నాయనేది నిజం కాదని, అవి కేవలం పుకర్లాని పోలీసులు మైకులు పట్టుకుని అనేక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించినప్పటికీ చాలా కాలం వరకు ఈ భయం ప్రజల నుంచి దూరం కాలేదు. ఇక తాజాగా చిన్న పిల్లల మిస్సింగ్లపై సోషల్ మీడియామాధ్యమాలలో వచ్చిన వార్తలు కూడా పోలీసులకు కలవరం కలిగించాయి. మిస్సింగ్ అవుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నదని, ఇందులో ట్రేస్ అవుతున్న వారి సంఖ్య తక్కువంటు వచ్చిన వార్తల పట్ల పోలీసు ఉన్నతాధికారులు సైతం అసహనానికి గురయ్యారు. అయితే దాదాపు పదిహేనేళ్ల క్రితం ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఏడాదిలో 25 వేల మంది మహిళలు, మైనర్లు మిస్సింగ్ అయ్యారంటు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఈ వార్తలు నిజమేనని అప్పటి సీఐడీ ఉన్నతాధికారులు సైతం ఆఫ్ది రికార్డుగా అంగీకరించారు. మిస్సింగ్ అయిన మహిళలు, మైనర్ బాలికలలో చాలా వరకు హ్యూమన్ ట్రాఫికర్స్ బారిన పడి ముంబయి, బెంగళూరు, కోల్కొత్తాల్లోని వ్యభిచార కేంద్రాలకు విక్రయింబడ్డారని కూడా ఆ సమయంలో పోలీసు అధికారులకు సమాచారం అందింది. ఆ దిశగా చర్యలు చేపట్టిన సీఐడీ అధికారులు ముంబాయి రెడ్ లైట్ ఏరియాతో పాటు భీవండి, బెంగళూరు, కోల్కొత్తాల్లో దాడులు నిర్వహించగా అనేక మంది ఏపీకి చెందిన మహిళలు, మైనర్ బాలికలు రక్షించబడ్డారు. దీంతో పెద్ద ఎత్తున మిస్సింగ్ అవుతున్న మహిళలు, మైనర్లు వ్యభిచార కూపాలకు తరలించబడుతున్నారన్న కఠిన వాస్తవం వెలుగు చూసింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, మిస్సింగ్ అవుతున్న వారి వెనుక పలు కారణాలు ఉన్నాయని , అందులో 80 శాతం వరకు తిరిగి వెనక్కి వచ్చేశారని డీజీపీ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా, కిడ్నాపర్లు, దొంగతనాలు చేసే ముఠాలు పెద్దఎత్తున తిరుగుతున్నాయంటు సోషల్మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతూ ప్రజల్లో ఆందోళనకు దారి తీసింది. నిజామాబాద్తో పాటు రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాలలో చోటుచేసుకున్న దొంగనతాలు ఈ పుకార్లు నమ్మడానికి కారణమవుతున్నాయని కొందరు పోలీసు అధికారులే అంగీకరిస్తున్నారు. కాగా బాధ్యతారాహిత్యంగా కొందరు కిడ్నాప్లు జరుగుతున్నాయని, పెద్ద ఎత్తున దొంగల ముఠాలు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే అవుతుందని శనివారం డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అసత్య వార్తలు, సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి తమ ఐటీ, పోలీసు విభాగాలు రంగంలోకి దిగి చురుకుగా చర్యలు తీసుకుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ ఎవరైనా ఆగంకుతలు, అనుమానితులు తమ ప్రాంతాలలో తిరుగుతుంటే వెంటనే 100కు ఫోన్ చేసి గాని, లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.