Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఏఎఫ్ చీఫ్ బిఎస్ ధనోవా
హైదరాబాద్ : అరుణాచల్ప్రదేశ్లో ఇటీవల జరిగిన ఏఎన్-32 ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఐఏఎఫ్ చీఫ్ బిఎస్ ధనోవా అన్నారు. ఇటువంటి 'మిస్సింగ్' ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్త పడతామని ఆయన శనివారం అన్నారు. దాదాపు రెండు వారాల క్రితం అరుణాచల్ ప్రదేశ్లో 13 మందితో ఉన్న ఏఎన్-32 విమానం రాడార్ పరిధి నుంచి తప్పిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం కూలిన ఆ విమాన శకలాలను ఇటీవల అదే రాష్ట్రంలోని అడవుల్లో గుర్తించారు. దాంట్లో ఉన్న 13 మంది మరణించారని ఐఏఎఫ్ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్లోని దుండిగల్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ధనోవా విమాన ప్రమాదానికి సంబంధించి మాట్లాడుతూ ఏఎన్-32 డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. త్వరలోనే వాటిలోని సమాచారాన్ని విశ్లేషించి విచారణ మొదలుపెడతామని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని భూభాగం ఎక్కువగా మేఘావృతమై ఉంటుందని, అక్కడ ఎగిరే సమయంలో ఐఏఎఫ్ విమానాలే కాదు, పవన్ హన్స్కు చెందిన విమానాలు, హెలికాప్టర్లు కూడా నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.