Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు
- ఆరు స్థానాల్లో కాంగ్రెస్
- కోరం లేక రెండు వాయిదా
నవతెలంగాణ- విలేకరులు
జిల్లాల్లో వాయిదా పడిన మండలాల ఎంపీపీల ఎన్నికను శనివారం నిర్వహించారు. ఈనెల 7న జరగాల్సిన ఎంపీపీల ఎన్నిక పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం విదితమే. శనివారం నిర్వహించిన ఎన్నికల్లో 9 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. ఆరు స్థానాల్లో కాంగ్రెస్ ఎన్నికవ్వగా, భద్రాద్రి జిల్లాలో రెండు చోట్ల కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ మండల ఎంపీపీగా టీఆర్ఎస్ అభ్యర్థి కొమ్ము సుధాశ్రీని ఎన్నుకున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ ఎంపీపీగా కాంగ్రెస్ ఎంపీటీసీ చింత స్వప్నను ఎన్నుకున్నారు.
కాంగ్రెస్లో చేరి ఎంపీపీగా
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల అధ్యక్ష పదవి ఉద్రిక్తతల మధ్య కాంగ్రెస్ వశమైంది. మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలుండగా ఐదు టీఆర్ఎస్, ఐదు కాంగ్రెస్, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ తటస్థంగా ఉండటంతో ఎన్నిక రసవత్తరమైంది. చివరకు టీఆర్ఎస్ మన్ననూర్ ఎంపీటీసీ ప్రియాంక కాంగ్రెస్ సభ్యులతో మీటింగ్ హాల్కు రావడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. తోపులాటలో ఎంపీపీ అభ్యర్థి నలిగిపోయింది. కాంగ్రెస్లో చేరిన ఆమెకు ఇతర సభ్యులు మద్దతు తెలపడంతో ఎంపీపీగా ఎన్నికైంది.
కాంగ్రెస్, బీజేపీ మద్దతుతో టీఆర్ఎస్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఎంపీపీగా రాథోడ్ పుండలీక్ ఎన్నికయ్యారు. 9 ఎంపీటీసీ స్థానాల్లో ఐదు టీఆర్ఎస్, మూడు కాంగ్రెస్, రెండు బీజేపీ గెలిచింది. ఎంపీపీ పదవి కోసం టీఆర్ఎస్ నుంచి కేంద్రె జ్ఞానేశ్వర్, రాథోడ్ పుండలీక్ పోటీ పడ్డారు. కేంద్రె జ్ఞానేశ్వర్ పేరిట పార్టీ విప్ జారీ చేసింది. అయితే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతుతో రాథోడ్ పుండలీక్ విజయం సాధించారు. వైస్ ఎంపీపీగా బీజేపీకి చెందిన భరత్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చిరుమర్తి 'గ్రూపు' రాజకీయం
నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలంలో కాంగ్రెస్ నాలుగు ఎంపీటీసీ స్థానాలు, టీఆర్ఎస్కు 5, ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమ గ్రూపుకు చెందిన ఎంపీటీసీలతో పాటు కాంగ్రెస్కు చెందిన నలుగురు ఎంపీటీసీల మద్దతుతో కాంగ్రెస్ నుంచి గెలిచిన కేతెపల్లి ఎంపీటీసీ పి.శేఖర్ చేత ఎంపీపీగా నామినేషన్ దాఖలు వేయించారు. మిగతా సభ్యుల మద్దతు ఉండటంతో శేఖర్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అనంతరం శేఖర్ టీఆర్ఎస్లో చేరారు.నేరేడుగొమ్ము మండల ఎంపీపీగా బానావత్ పద్మ (టీఆర్ఎస్), వైస్ ఎంపీపీగా ఆరెకంటి ముత్యాలమ్మ (టీఆర్ఎస్) ఎన్నికయ్యారు.చందంపేట మండలం ఎంపీపీగా మున్సావత్ పార్వతి(కాంగ్రెస్), వైస్ ఎంపీపీగా జాల ప్రేమలత (కాంగ్రెస్) ఎన్నికయ్యారు.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో మహదేవ్పూర్-1 టీఆర్ఎస్ ఎంపీటీసీ బాన్సోడ రాణిబాయిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
భద్రాద్రి జిల్లా సుజాతనగర్ ఎంపీపీగా భానోత్ విజయలక్ష్మి (కాంగ్రెస్), లక్ష్మీదేవిపల్లి ఎంపీపీగా బూక్యా సోనీ(టీఆర్ఎస్) ఎన్నికయ్యారు. కోరం లేక ములకలపల్లి, ఆళ్లపల్లి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల ఎంపీపీగా టీఆర్ఎస్కు చెందిన బండ్ల ప్రశాంతి కోటయ్య ఎన్నికయ్యారు.
జగిత్యాల జిల్లా జగిత్యాల అర్బన్ ఎంపీపీగా ధరూర్ రిజర్వుడు స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీటీసీ మ్యాదరి వనిత ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీ ఎన్నికను ఆదివారం నిర్వహించనున్నారు. సారంగాపూర్ మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలో ఎంపీపీగా కోనాపూర్ గ్రామానికి చెందిన పెంబట్ల టీఆర్ఎస్ ఎంపీటీసీ కోల జమున ఎన్నికయ్యారు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా మేడిగడ్డ టీఆర్ఎస్ ఎంపీటీసీ నేనావత్ అనిత విజరుకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
లాటరీలో మాడ్గుల ఎంపీపీ స్థానం కాంగ్రెస్ కైవసం
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకుగాను టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 6, ఆల్ఇండియన్ పార్వడ్ బ్లాక్ ఒకటి గెలుపొందాయి. ఆల్ఇండియన్ పార్వడ్ బ్లాక్ సభ్యురాలు కల్లు జ్యోతి రాజశేఖర్రెడ్డి మద్దతివ్వడంతో కాంగ్రెస్ బలం 7కు చేరింది. దీంతో అధికారులు మూడు పదవులకు లాటరీ తీశారు. కోఆప్షన్ సభ్యుడిగా జోజిరెడ్డి ఎన్నికయ్యారు. ఎంపీపీగా కాంగ్రెస్ ఎంపీటీసీ గౌరవరం పద్మ ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా టీఆర్ఎస్ నుంచి కొర్ర శంకర్ నాయక్ ఎన్నికయ్యారు.