Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 76 మందిని టింబర్ డిపోలో
- నిర్బంధంపై హైకోర్టు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అడవిని ఖాళీ చేయించే పేరుతో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు గిరిజనులను బలవంతంగా బయటకు పంపేస్తున్నారని, కొమురంబీమ్ జిల్లా కాగజ్నగర్ మండలం కొలంగొండిలో ఏకంగా 67 మంది గిరిజనులను అటవీశాఖ టింబర్ డిపోలో చట్ట వ్యతిరేకంగా నిర్బంధించారని దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కుటుంబాలకు చెందిన 16 మంది పెద్దలను ఆదివారం హైకోర్టులో హాజరుపర్చాలని
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. టూరిజం శాఖ వాహనాల్లో వాళ్లను తీసుకురండి. ఆదివారం సాయంత్రం ఐదింటికి ఈ కేసును తిరిగి విచారిస్తాం. అప్పుడు ఆ కుటుంబాల పెద్దలు చెప్పే విషయాల్ని తమకు అర్ధమయ్యే రీతిలో చెప్పేందుకు వీలుగా ఫ్రొఫెసర్లు మనోజ, జయధీర్ తిరుమలరావులు కోర్టుకు వచ్చే ఏర్పాట్లు చేయండంటూ బెంచ్ ప్రకటించింది. అడవి నుంచి ఖాళీ చేయించే క్రమంలోనే వాళ్లని వేంపల్లి టింబర్ డిపోలో ఉంచామని ప్రభుత్వ లాయర్ జవాబు చెప్పడం పట్ల హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. అటవీ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని భావిస్తే వారందరికీ పునరావాస చర్యలు తీసుకున్నాకే ఆ పని చేయాలి. కొంత మందికి భూమి కేటాయించి మరికొందరికి చేస్తామని చెప్పి ముందే అటవీ ప్రాంతం నుంచి ఎందుకు తరలించాలి? అయినా ఫారెస్ట్ డిపోలో ఉంచడమెందుకు? పునరావాసం కల్పించాకే తరలిస్తే సరిపోయేది కదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఫారెస్ట్ డిపోలో 67 గిరిజన కుటుంబాల్ని ఈ నెల 12 నుంచి చట్ట వ్యతిరేకంగా అక్రమ నిర్బంధం చేశారని, వారి హక్కుల్ని దెబ్బతీసేలా అటవీ అధికారుల చర్యలున్నాయని పేర్కొంటూ తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి తన ఇంటి వద్ద శనివారం అత్యవసరంగా విచారించింది. గిరిజనుల ఇండ్లను కూల్చేశారని, ఉపాధి లేకుండా చేసే చర్యలో భాగంగా సాగు చేసుకోనీయడం లేదని, పశువుల కొట్టాలను కూడా పీకేశారని పిటిసనర్ లాయర్ రఘునాథ్ వాదించారు. 67 మందిలో మైనర్లు, మహిళలున్నారని, వీరిని అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. వాళ్లకు తిండి లేక అడవుల్లోని దుంపలు తింటున్నారని, మహారాష్ట్ర వెళ్లిపోవాలని వాళ్లందరినీ వేధిస్తున్నారని చెప్పారు. అటవీ చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా చేస్తున్నారని తెలిపారు. సిడెం పావుతో సహా 67 మందిలో మహిళలు మైనర్లు ఉన్నా అధికారులు కనికరం లేకుండా ఫారెస్ట్ డిపోలో నిర్బంధించారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం తరఫు లాయర్ మనోజ్ స్పందిస్తూ...అడవుల్ని రక్షించే క్రమంలోనే భాగంగానే వారిని అడవుల నుంచి తరలిస్తున్నట్టు తెలిపారు. వారంతా ఫారెస్ట్ డిపోలో ఉన్నారని, వారికి నిర్బంధించలేదని చెప్పారు. అడవుల నుంచి ఖాళీ చేయించిన గిరిజనులకు భూములు కూడా కేటాయింపులు చేస్తున్నామని, ఇతరులకు కూడా చేస్తామని తెలిపారు. ఈ వాదనల అనంతరం విచారణ ఆదివారానికి వాయిదా పడింది.