Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ఆఫీసు బేరర్లు, ముఖ్యుల సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక తీర్మానాన్ని అమోదించింది. ఫెడరేషన్ అధ్యక్షులు ఎం.సోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో గత కార్యక్రమాల సమీక్షా నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య సమర్పించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఇండ్లస్థలాలు, ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. హెల్త్కార్డుల అమలు విషయంలో సర్కారు చురుగ్గా వ్యవహరించడం లేదని సమావేశం అభిప్రాయపడింది. అలాగే అక్రిడిటేషన్లు ఒకేసారి రెండేండ్లకు కాకుండా, పదే పదే పొడిగించడం జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆన్లైన్లో అక్రిడిటేషన్ కార్డులు జారీచేసే ప్రక్రియను సమాచార, పౌరసంబంధాల శాఖ చేపట్టిందని, ఆ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చిన్న, మధ్య తరహా పత్రికలకు మరిన్ని అక్రిడిటేషన్ కార్డులు జారీచేయాలని విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల సమస్యలను అలక్ష్యం చేస్తే, రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు జర్నలిస్టులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఆనందం, పిల్లి రాంచందర్, వై. ప్రభాకర్, టి.కృష్ణ, కార్యదర్శి నర్సింగ్రావు, కోశాధికారి ఆర్.వెంకటేశ్వర్లు, హెచ్యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ విజయానంద్, రాష్ట్ర నాయకులు జగన్, పాండు, పద్మనాభరావు, రఘునాధరావు పాల్గొన్నారు.