Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా భూమిని కాపాడుకోలేకపోతున్నా
- సోషల్ మీడియాలో ఆర్మీ జవాన్ ఆవేదన
- స్పందించిన కామారెడ్డి కలెక్టర్
నవతెలంగాణ-తాడ్వాయి
'దేశ భద్రత కోసం బార్డర్లో ఉన్నా.. కానీ మా సొంత భూమిని కాపాడుకోలేకపోతున్నా' అంటూ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి వద్ద భూ పంచాయితీపై కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన జవాన్ స్వామి సోషల్మీడియా వేదికగా ఆందోళన వ్యక్తపరిచారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. అందులోని ఆయన మాటల్లోనే..
'దేశంలో జై జవాన్, జై కిసాన్ అని అందరూ అంటుంటారు. కానీ ఇదే దేశంలో జవాన్కు సంబంధించి, రైతుకు సంబంధించి ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. ఆరెకరాల భూమిని 25 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నాం. కానీ, మా ప్రమేయం లేకుండానే, మాకు తెలియకుండానే పిప్పిరి ఆంజనేయులు లాగేసుకున్నాడు. ఆయన రెవెన్యూ అధికారులకు ఎవరెవరికి డబ్బులిచ్చారో తెల్వదు. కానీ, మా ఆరెకరాలను ఆయన పేరుమీదకు మార్చుకొని.. మా అమ్మానాన్నలను చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఊర్లోకి ఎవరూ రావొద్దని, వస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దేశ రక్షణ కోసం బార్డర్కు వచ్చిన నేను.. ఇంటి దగ్గర ఇలాంటి బాధలు ఉండటం వల్ల ఏమీ చేయలేకపోతున్నా. రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. ఇంటి వద్దనేమో అమ్మానాన్నలను చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ టెన్షన్తో డ్యూటీ చేయాలా..? మానేసి ఇంటికి పోవాలా అనే ఆలోచన వస్తోంది. ఈ సమస్య ఇప్పుడు నాకు వచ్చింది. తర్వాత మీకు రావొచ్చు. కావునా దయచేసి సీఎం కేసీఆర్కు చేరే వరకూ షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్' అంటూ ముగించారు.
కలెక్టర్ స్పందన
జవాన్ స్వామి వీడియో వైరల్ కావడంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్పందించారు. స్వామి తండ్రి చప్పటి సాయిరెడ్డి, గుండ్రేటి సంగారెడ్డి నాలుగేండ్ల కిందట భూమి విషయంలో తగాదా పడి తాడ్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నట్టు తెలిపారు. సంగారెడ్డికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన పిప్పిరి ఆంజనేయులుకు రిజిస్టర్ దస్తావేజు నెం.5695/2018 ద్వారా భూమి అమ్మినట్టు కలెక్టర్ తెలిపారు. కాగా, జవాన్ స్వామి ఏప్రిల్ 4వ తేదీన సైనిక కంపెనీ కమాండర్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి లేఖ పంపారు. దీనిపై స్పందిస్తూ.. కామారెడ్డి ఎస్పీ, ఆర్డీవో, తాడ్వాయి తహసీల్దార్కు తక్షణ చర్య తీసుకోవాలని మే 7వ తేదీన ఆదేశించినట్టు తెలిపారు. దాంతో తాడ్వాయి తహసీల్దార్ పిప్పిరి ఆంజనేయులుకు పాసుబుక్కులు జారీ కాకుండా, డిజిటల్ సంతకం చేయకుండా ఆపేసినట్టు కలెక్టర్ తెలిపారు. విచారణలో వ్యవసాయ భూమి కబ్జా, హక్కుల కోసం ఇరువురి మధ్య భూతగాదా ఉందని తేలిందన్నారు. న్యాయం కోసం సివిల్ కోర్టును సంప్రదించాలని జవాన్ తండ్రి చప్పటి సాయిరెడ్డికి మే 29వ తేదీన ఆర్డీవో లేఖ నెం ఏ3/745/2019 ద్వారా తెలిపినట్టు వివరించారు.