Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబాలతో కలిసి పోరాడితేనే సమస్యలు పరిష్కారం:
రాష్ట్ర సదస్సులో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
- ప్రభుత్వం దిగొచ్చేలా ఐక్య ఉద్యమం : మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఎయిడెడ్ కాలేజీల టెంపరరీ స్టాఫ్ అసోసియేషన్ (ఏసీటీఎస్ఏ) ఆధ్వర్యంలో ఎయిడెడ్ విద్యాసంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు కలిసి ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాలపై నిషేధం విధిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 35ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఎయిడెడ్ కోర్సులను సెల్ఫ్ఫైనాన్స్గా మార్చడం సరైంది కాదన్నారు. ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం ప్రయివేటుపరం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పోరాడిన అనుభవం ఉందన్నారు. ఉపాధ్యాయ సంఘాల మద్దతు తీసుకుంటామని అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను పరిరక్షించాలని కోరుతూ శాసనమండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ విద్యాసంస్థలు గొప్పగా సేవలందించాయని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎంతో మంది ప్రముఖులు ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదివిన వారేనని చెప్పారు. మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖర్రెడ్డి, కె రోశయ్య, తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చదువుకున్నారని అన్నారు. అధ్యాపక, బోధనేతర సిబ్బందితోపాటు కుటుంబాలు, విద్యార్థులు, వారి కుటుంబాలు ఐక్యమై రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షణ కోసం పెద్ద ఉద్యమాన్ని చేపట్టాలని కోరారు. అప్పుడే ప్రభుత్వంలో కదలిక వస్తుందని చెప్పారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను కాపాడుకోవడానికి ఉద్యమం చేపడతామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జావీద్ అన్నారు. విద్యార్థులను సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల సిబ్బంది చేసే ఉద్యమాలకు అండగా ఉంటామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆర్ఎన్ శంకర్ అన్నారు. అధ్యక్షత వహించిన ఏసీటీఎస్ఏ వ్యవస్థాపకులు నల్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం విజయలలిత మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రయివేటీకరణ ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు. అన్ఎయిడెడ్ సిబ్బంది సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సెల్ఫ్ఫైనాన్స్ కోర్సులను ఎయిడెడ్ కోర్సులుగా మార్చాలని అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కాపాలని చెప్పారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను కాపాడుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీటీఎస్ఏ నాయకులు జి రమేష్, రఘువేందర్, రాజేంద్రప్రసాద్, ఎం శేఖర్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.