Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వయం సహాయ సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6584.13 కోట్లను ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హైదరాబాద్లోని స్వయం సహాయక సంఘాల సంవత్సర పొదుపు ప్రణాళిక సమీక్షా సమావేశం హైదరాబాద్లోని బేగంపేటలో గల టూరిజం ప్లాజాలోని ప్రాణిహిత హాల్లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి స్వయం సహాయక సంఘాల గురించి సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి దాకా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం 27,092.62 కోట్ల రూపాయలను ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో 543 మండల మహిళా సమాఖ్యలు, 30 జిల్లా సమాఖ్యలు ఏర్పాటయ్యాయన్నారు. గ్రామాల్లో అసంఘటితంగా ఉన్న పేదలను సంఘటితం చేయడం ఈ సంఘాలు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2184 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేసినట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాల బ్యాంకు రుణ నిలువ రూ.9539.35 కోట్లకు చేరుకున్నదని, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బ్యాంకు రుణం ఒక్కో గ్రూపునకు రూ.1.90 లక్షలుండగా..అది నేడు రూ.3.90 లక్షలకు చేరుకున్నదన్నారు. గతేడాది స్వయం సహాయక సంఘాలకు రూ.6048 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా...6196 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చినట్టు తెలిపారు. సంఘాలు తీసుకున్న రుణాలను 75 శాతం తగ్గకుండా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. రూ.5 లక్షల వరకు పొందిన రుణాలకు వడ్డీ లేని రుణ పథకం వర్తిస్తుందన్నారు. బ్యాంకు లింకేజీ అమలులో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.