Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'భగీరథ' సరఫరాపై తప్పుడు నివేదిక
- తాగునీటి సమస్య తీర్చడంలో అధికారుల నిర్లక్ష్యం
నవతెలంగాణ-పెబ్బేరు
తాగునీటి సమస్యలు పరిష్కరించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సర్పంచ్లు నేలపై కూర్చోని నిరసన వ్యక్తం చేశారు. తమపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని సర్పంచులుగా గెలిపించారనీ నాలుగు నెలలవుతున్నా నేటికీ చెక్పవర్ రాకపోవడంతో పనులు చేయలేక ప్రజలకు ముఖం చూపలేకపోతున్నామనీ ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ పద్మావతి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సర్పంచ్లు గోవిందనాయుడు, రాజ వర్ధన్రెడ్డి, రవికుమార్, బసవరాజు వెంకటే శ్వర్రెడ్డి గ్రామాల్లో సమస్యలపై వివరించారు. అధికారులు పట్టించుకోవడం లేదని మండల పరిషత్లోనే నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉన్న బోర్లకు సొంత డబ్బులతో మరమ్మతులు చేయించి తాగునీటిని అందిస్తున్నామనీ, వాటికీ బిల్లులు చెల్లించటం లేదనీ భగీరథ నీరు మండల వ్యాప్తంగా సరఫరా అవుతుందని అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. పెంచికలపాడు, జనంపల్లి, ఈర్లదిన్నె, బూడిదపాడు గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదని తెలిపారు. భగీరథ నీళ్లు రాక ఉన్న బోర్లు పనిచేయక ప్రజల దాహార్తి ఎలా తీరుతుంది అని సర్పంచ్లు ఆగ్రహించారు. కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు దిగి రావాలని, నేలపై కూర్చుని నిరసన తెలిపారు. సమస్యలపై అధికారు దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పడంతో సద్దుమణిగారు. సమావేశంలో జడ్పీటీసీ ప్రకాష్, తహశీల్దార్ సునీత, ఇన్చార్జి ఎంపీడీవో ఆంజనేయులు, సూపరింటెండెండ్ వరలక్ష్మి, ఈఓఆర్డి పరమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.