Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే గొడుగు కిందకు 145 చట్టాలు
- ఇక రెవెన్యూ కోడ్-2019
- తద్వారా ఆ శాఖ ప్రక్షాళన
- సమాయత్తమవుతున్న సర్కారు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ చట్టాలను ఏకీకృతం చేయాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం, ప్రస్తుతం అమల్లో ఉన్న 145 చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. కొత్త చట్టాన్ని 'తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్-2019'గా ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. నూతన చట్టం తేవడం ద్వారా మరో ప్రయోజనం కూడా నెరవేరేలా పావులు కదుపుతున్నది. రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని తొలి నుంచి భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, పాత చట్టాల స్థానే కొత్త చట్టాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడమేగాకుండా.. అవసరమైతే రెవెన్యూ శాఖను రద్దు చేయడమో, ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సంకేతాలిచ్చిన విషయం విదితమే. అంతేగాకుండా బ్రిటీష్ కాలంలో శిస్తు వసూలు చేయడానికి నియమించిన కలెక్టర్ల వ్యవస్థను ఇప్పటికీ కొనసాగిస్తుండడాన్ని ఆయన ఇప్పటికే తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ల హోదాను పునఃనిర్వచించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అంతర్గత చర్చల్లో ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో ప్రస్తావించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ హోదాల మార్పును కేవలం కలెక్టర్లకే పరిమితం చేయకుండా ఆర్డీఓ, తహసీల్దార్లకు కూడా అమలు చేయాలని ఆయన భావనగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు రెవెన్యూ వ్యవస్థలోనే సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా భూ రికార్డుల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, భూ రికార్డుల నవీకరణ అనంతరం కూడా భూ వివాదాలు తగ్గకపోగా.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నది. దీనికి ప్రధాన కారణం రెవెన్యూ ఉద్యోగులేననే భావన ముఖ్యమంత్రిలో నెలకొన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి కేసీఆర్, రెవెన్యూ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడం, ఆ మేరకు నిపుణుల కమిటీ కూడా కసరత్తు చేస్తున్నది. కాగా, భవిష్యత్లో భూవివాదాలకు ఆస్కారం లేకుండా, శాశ్వత పరిష్కారం కలుగజేస్తూ టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే, ఈ చట్టం అమలు అనుకున్నంత సులువు కాదని భావిస్తున్న సర్కారు.. ప్రస్తుతానికి కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా భూసమగ్ర సర్వే, టైటిల్ గ్యారంటీని అమలు చేయడమా? లేక తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్-2019ను ప్రవేశపెట్టడమా అనే అంశంపై చర్చిస్తున్నది. ఈ రెవెన్యూ కోడ్లోనే ప్రస్తుతం మనుగడలో ఉన్న 145 చట్టాలను ఏకీకృతం చేయనున్నారు. తద్వారా ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానే ఒకే చట్టం అందుబాటులోకి రానుంది.