Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్ను రద్దు చేయాలి
- రెవెన్యూ శాఖ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం
- 18 డిమాండ్లపై త్వరలో ప్రభుత్వానికి నివేదిస్తాం :
- తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ రవీందర్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ని 2018, జులై 1వ తేదీ నుంచి అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ కారం రవీందర్రెడ్డి చెప్పారు. పీఆర్సీ అమలు ఆలస్యమవుతున్నందున 43 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2018, జులై 1 నుంచి ఐఆర్ వర్తింపచేయాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించి 18 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని టీఎన్జీవో భవన్లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019, జనవరి 1 నుంచి బకాయి ఉన్న డీఏను వెంటనే ప్రకటించాలని చెప్పారు. కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్) వల్ల ఉద్యోగులకు, ప్రభుత్వానికి నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనమూ లేదని అన్నారు. విధానాన్ని రద్దు చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. పాత విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 1,200 మంది తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించారని, వారక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని తెలంగాణకు తేవాలని కోరారు. రెండు ప్రభుత్వాలు ఈ సమస్యను చర్చించి పరిష్కరించాలని కోరారు. జయశంకర్ బడిబాట కార్యక్రమం పూర్తయిన తర్వాతే పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. గ్రంథాలయాలు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈలోపు వారికి మినిమం టైంస్కేల్ చెల్లించాలని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. గృహనిర్మాణం, మార్కెటింగ్ కమిటీలు, కార్పొరేషన్లలో తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని అన్నారు. పండితులు, పీఈటీలను అప్గ్రెడేషన్ చేయాలని చెప్పారు. రూ.398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ చెల్లించాలని అన్నారు. సింగరేణి కాలరీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం పరిపాలనలో భాగంగా చేపట్టే సంస్కరణలకు ఉద్యోగులు పూర్తిగా సహకారం అందిస్తున్నారని తెలంగాణ ఉద్యోగ జేఏసీ సెక్రెటరీ జనరల్ వి. మమత అన్నారు. ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏండ్ల నుంచి 61కు పెంచాలని డిమాండ్ చేశారు. వెల్నెస్ సెంటర్లను అన్ని జిల్లాల్లో విస్తృతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని అన్నారు. జూన్ లేదా జులైలో సాధారణ బదిలీలు చేపట్టాలని సూచించారు. పదోన్నతులకు కావాల్సిన కనీస సర్వీసును మూడేండ్ల నుంచి రెండేండ్లకు కుదించాలని కోరారు.
పాత జిల్లాల మాదిరిగా కొత్త జిల్లాల్లోని కార్యాలయాలకు ఉద్యోగుల సంఖ్యను మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులు ఎం రాజేందర్, పి మధుసూదన్రెడ్డి, సత్యనారాయణ, మణిపాల్రెడ్డి, జ్ఞానేశ్వర్, బి రేచల్, ఆర్ శ్రీనివాసరావు, ఎ పద్మాచారి, పి పవన్కుమార్గౌడ్ ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కె.లక్ష్మన్, కార్యదర్శి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.