Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో రోజుకు 45 మంది రైతులు మృతి
- రైతు బీమా చెల్లింపుల లెక్కలే ఇందుకు నిదర్శనం
- ఉలుకూ, పలుకూ లేని సర్కారు
- అకాల మరణాల్లో 58 ఏండ్ల లోపు వారే ఎక్కువ
- లెక్కకు రాని కౌలుదార్ల చావులు
మరణం సహజమే...అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. కానీ పట్టెడన్నం పెట్టే అన్నదాత అకాల మరణం చెందడం ఆందోళన కలిగిస్తున్నది. సాగు చేసే నడీడు రైతులు 'నేల' రాలుతున్నారు. రాష్ట్రంలో ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులు రోజుకు 45 మంది మరణశయ్యపైకి పోవడం ఆందోళనకరంగా మారింది. వివిధ కారణంతో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. అంతకు మించి కారణాలతో రైతన్నలు నేలకొరుగుతున్నారు. రైతు బీమా చెల్లింపుల ద్వారా రైతు మరణాలు వెలుగులోకి వచ్చాయి.
మనిషి సగటు జీవిత కాలానికి కూడా రైతన్న చేరుకునే పరిస్థితులు రాష్ట్రంలో కనిపించడం లేదు. అందుకు పట్టా రైతుల మరణాల లెక్కలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మరణంలోనూ కౌలుదార్లు పాలకులకు పట్టడం లేదు. రైతు అకాల మరణాలపై ఇక్కడి వ్యవసాయ శాఖ అధ్యయనం చేయడంలేదు. కనీసం రైతు మరణాలకు సంబంధించిన కారణాలను విశ్లేషించకుండా అలక్ష్యం చేస్తున్నది. దారినపోయే దానయ్యల్లా చూస్తున్నది. అయితే మన రాష్ట్రంలో ప్రతి రోజు పిట్టల్లా రాలిపోతున్న రైతు మరణాలపై మేధావులు, రైతు సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు రైతన్న మరణాలు...మరోవైపు సాగుపై యువత అనాసక్తి ప్రదర్శిస్తుండటంతో భవిష్యతులో సాగు చేసేవారు దొరుకుతారా? అన్న భరోసా కనిపించడం లేదని అంటున్నారు. ఈ తరహా ఆందోళనకర పరిస్థితులకు కారణాలు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణంగా రాత్రిపూట పంట పోలాలకు నీళ్లు పెట్టేందుకు బోరుబావుల వద్దకు పోతున్న సమయంలో రైతులు విద్యుత్ షాక్ తగిలి చనిపోతున్నారు. దీంతోపాటు వేసవికాలంలో వడగాల్పులతోనూ మరణిస్తున్నారు. కొంత మంది రైతులు పాముకాటుకు బలిఅవుతున్నారు.
సైలెంట్ కిల్లర్లా క్రిమిసంహారక మందులు
నాణ్యమైన పంట దిగుబడి, అధిక ఉత్పత్తి కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పిన దానికి కంటే రైతులు ఎక్కువగా పురుగుల మందులు ఉపయోగిస్తున్నారని తెలంగాణ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీని ప్రభావం రైతుపై సైలెంట్ కిల్లర్లా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యూరియా అత్యధిక మొతాదులో ఉపయోగించడం వల్ల అది నీటిలో కరిగి నైట్రెట్్గా మారి క్యానర్కు దారి తీస్తున్నదని రైతు నేత కన్నెగంటి రవి అందోళన వ్యక్తం చేశారు. దీంతో మనం తినే తిండి నేరుగా ప్రభావం చూపిస్తున్నది.
మద్యం వ్యసనానికి..
ఊర్లల్లో మద్యాన్ని తెలంగాణ సర్కారు ఏరులై పారిస్తున్నది. పొద్దంతా రెక్కలు ముక్కలయ్యేలా కష్టప డుతున్నా రైతన్నను మద్యం బలి తీసుకుంటున్నది. అనేక మంది తాగుడుకూ బానిసలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ఏటా రూ 25వేల కోట్ల మందు అమ్మకాలు చేస్తున్నది. అందులో సర్కారుకు నేరుగా రూ 10 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. దీంతో విచ్చలవిడిగా మద్యా న్ని ప్రోత్సహిస్తున్నది. ఇందులో మహిళా రైతుల కంటే మగ రైతులే దానికి ఎక్కువగా ప్రభావానికి గురివుతున్నారు. అం దుకే మహిళ రైతుల మరణాలు కూడా తక్కువగా ఉన్నాయి.
పత్తి వేసి.. పాణం మీదికి...
పత్తి పంట వేసి.. చాలా మంది రైతులు పాణం మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక్కడి ఊర్లలో సాగు భూమిలో 50 శాతానికి మించి పత్తి సాగు చేస్తున్నారు. అధిక పెట్టుబడి...తక్కువ ఉత్పత్తి ధరలు లేకపోవడంతో రైతన్న అప్పులపాలై విధిలేని పరిస్థితుల్లో ఉరితాడుకు వేలాడుతున్నారు. మరో వైపు పత్తి సాగు చేయడం ద్వారా కూరగాయలు, పప్పు ధన్యాల సాగు తగ్గుతున్నది. తత్పలితంగా రైతన్నలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో రైతులే కాకుండా చిన్న పిల్లలు, మహిళలు కూడా మరణిస్తున్నారు. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో 1.40 కోట్లమంది నివాసముండగా, ఊర్లలో 2.60 కోట్ల మంది బతుకుతున్నారు. అందులో గ్రామాల్లోనే ఎక్కువగా చనిపోతున్నారు.
కౌలు రైతుకు పుట్టెడు కష్టాలు
పట్టాదారులు మాత్రమే రైతులుగా టీఆర్ఎస్ సర్కార్ గుర్తిస్తున్నది. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడ్డ రైతులు మరణించినా అవి సర్కారు లెక్కలోకి రావడం లేదు. ముఖ్యంగా పుట్టెడు కష్టాలను ఎదుర్కొంటున్న కౌలు రైతు చనిపోతే.. అవి లెక్కలోకి రావడం లేదు. దీంతో వారికి ఎలాంటి సాయం దక్కడం లేదు. తండ్రి పట్టాదారుడైతే అదే భూమిని సాగుచేస్తున్న ఆయన కుమారుడో, తమ్ముడో మరణిస్తే కనీసం లెక్కలోకి తీసుకోవడం లేదు. వ్యవసాయంపై ఆధారపడిన కూలీల లెక్కలు కూడా సర్కారు తీయడం లేదు. ఇలాంటి మరణాలను సైతం లెక్కలేస్తే ప్రతి రోజు 60 నుంచి70 మంది అన్నదాతలు మరణిస్తున్నారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వైద్యం, నాణ్యమైన ఆహారం తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అందుకే రైతు మరణాల కంటే ఉద్యోగుల మరణాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.