Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేసీఆర్ అంటున్నట్టుగా రాష్ట్రం బంగారు తెలంగాణ ఏమోగానీ బాధల తెలంగాణగా మాత్రం మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిటి అయోగ్ సమావేశానికి హాజరుకాకపోవడం దారుణమన్నారు. ప్రధాని మోడీ దగ్గర కేసీఆర్కు మొహం చెల్లదు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి ఆహ్వానించలేదన్నారు. కవిత, వినోద్ ఓడిపోవడాన్ని, బీజేపీ నాలుగు స్థానాలను గెలువడాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నదన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై వచ్చే రెండు నెలల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేయబోతున్నామన్నారు. కార్పొరేట్ కళాశాల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ 24న స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ ముందు ధర్నా చేస్తామన్నారు. వాస్తు పేరిట సచివాలయాన్ని కూలగొట్టడం దారుణమన్నారు. తెలంగాణ ద్రోహులను సీఎం కేసీఆర్ అందలం ఎక్కిస్తున్నారని, తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులను నిరుద్యోగులుగా మార్చారని విమర్శించారు.