Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలి పెంచాలని అడిగినందుకు గొడవ
- జగిత్యాల జిల్లా పాతధాంరాజ్పల్లిలో ఘటన
నవతెలంగాణ-మల్లాపూర్
డప్పు కొట్టనందుకు దళితులపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాతధారరాజ్పల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దళితుల్లో కొందరు డప్పులు కొడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. దహన సంస్కారాలకు, గృహప్రవేశాలకు, గ్రామంలో నిర్వహించే శుభకార్యాలు, ఉత్సవాలు, బోనాలకు వీరే డప్పులు వాయిస్తారు. ఆయా కులసంఘాలకు చెందిన గ్రామ పెద్దల వద్ద డప్పుకూలి పెంచాలని కొందరు దళితులు ఇప్పటికే చాలాసార్లు మొరపెట్టుకున్నారు. ఒక్కో డప్పును గతంలో రూ.300కు వాయించేవారు. అయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో గిట్టుబాటు కావడం లేదని కూలి రూ.400 ఇవ్వాలని పెద్దలను కోరారు. గ్రామ పెద్దలు రూ.350 మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో దళితులు నిరాకరించారు. గిట్టుబాటు కాదనీ, డప్పులు కొట్టబోమనీ పెద్దలకు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాలు నిర్వహించాల్సి ఉండగా.. డప్పులు కొట్టడానికి దళితులు రాలేదు. దీంతో పెద్దలు సన్నాయిల వారిని ఆహ్వానించగా వారిని దళితులు అడ్డుకున్నారు. ఇది ఊరు గొడవలా ఉందని భావించి సన్నాయివారు కూడా వెనుదిరిగారు. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి చొరవ చూపని ఊరి పెద్దలు.. డీజే చప్పుళ్లతో ఊరి బోనాలను ఊరేగింపుగా తీశారు. డీజేను సైతం దళితులు అడ్డుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొంతమంది వ్యక్తులు దళితులపై దాడి చేశారు. తోపులాట చేసుకోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరుగ్రూపులను చెల్లాచెదురు చేశారు. ఇదే విషయంపై ఎస్ఐ పృద్విధర్గౌడ్ను వివరణ కోరగా ఇరుగ్రూపుల మధ్య గొడవ జరిగిందనీ, ఎవరూ పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయలేదనీ తెలిపారు.