Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షలు ముగియక ముందే తరగతులు ప్రారంభం
- సీబీసీఎస్ అమలులో అధికారుల విఫలం
- ఉన్నత విద్యామండలి, వర్సిటీల మధ్య సమన్వయలేమి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీ విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమల్లోకి వచ్చి మూడేండ్లయినా ఇంకా కష్టాలు తప్పడం లేదు. సీబీసీఎస్ పూర్తిస్థాయిలో అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. డిగ్రీ పరీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరీక్షలు ముగియకముందే డిగ్రీ తరగతులు ప్రారంభం కావడం గందరగోళానికి తావిస్తున్నది. ఓయూ పరిధిలో జులై 8 వరకు, కాకతీయ పరిధిలో జులై 2 వరకు, తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జులై 6 వరకు, పాలమూరు వివ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 29 వరకు, శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 24 వరకు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 22వ తేదీ వరకు డిగ్రీ పరీక్షలు జరుగుతాయి. కానీ డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు శాతవాహన, కాకతీయ, ఉస్మానియా, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలో ఈనెల 17 నుంచి, పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 19 నుంచి, తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 26వ తేదీ నుంచి 2019-20 విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని ప్రకటించాయి. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యామండలి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, అధ్యాపకుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకవైపు పరీక్షలు జరుగుతుండగానే ఇంకోవైపు తరగతులు ప్రారంభమయ్యాయని ప్రకటించడం ఎంత వరకు సమంజసమని అధ్యాపకులు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాల అధికారుల మధ్య సమన్వయం లేదనడానికి ఈ నిర్ణయమే నిదర్శనం. ఇలాంటి నిర్ణయాల వల్ల విద్యార్థులపై మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షలు రాయాలా? తరగతులకు హాజరు కావాలా?అన్న సంక్లిష్టంగా మారింది. ఇంకోవైపు డిగ్రీ పరీక్షలు జరుగుతుండగానే కేంద్రీయ విశ్వవిద్యాలయాల పీజీ ఎంట్రెన్స్ టెస్ట్లు, ఐసెట్, లాసెట్, ఎడ్సెట్, పీఈసెట్ రాతపరీక్షలు జరిగాయి. ఒకవైపు డిగ్రీ పరీక్షలకు చదువుతూనే ప్రవేశ పరీక్షల కోసమూ ప్రిపేరయ్యారు. దీంతో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇవేవీ పట్టకుండా అధికారులు పరీక్షలు జరుగుతుండగానే తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వర్సిటీ అధికారుల అసమర్థత వల్లే ఈ గందరగోళం : అధ్యాపకుల సంఘం
విశ్వవిద్యాలయాల అధికారుల అమసర్థత వల్లే డిగ్రీ విద్యార్థులకు ఈ గందరగోళం నెలకొందని ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు ఎ సంజీవయ్య, ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండుటెండల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఇవి పూర్తికాకుండానే తరగతులకు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. గత విద్యాసంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన తర్వాత కనీసం రెండు వారాలైనా సెలవులు ఉండాలని సూచించారు. ఆ తర్వాతే డిగ్రీ తరగతులు ప్రారంభించాలని కోరారు. విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉందని, నిర్ణయాలపై స్వేచ్ఛ ఉందని విద్యార్థులను గందరగోళానికి గురిచేయొద్దని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్యాసంవత్సరం ప్రారంభించాలని కోరారు.