Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాటిచ్చి ఐదేండ్లయినా రాని అధికారిక ఉత్తర్వులు
- వీకెండ్ల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న రాష్ట్ర కానిస్టేబుళ్లు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
వారాంతపు సెలవుల కోసం రాష్ట్రంలోని దాదాపు నలభై వేల మంది కానిస్టేబుళ్లు చకోర పక్షుల్లా దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. వీకెండ్ సౌలభ్యం తమకు లభిస్తుందా? ఆ దిశగా ప్రభుత్వం కానీ, ఉన్నతాధికారులు కానీ ఆలోచనలు చేస్తున్నారా? చేస్తే ఎప్పటి నుంచి అమలు చేస్తారు? అందుకు తగిన ఆదేశాలు ఎప్పుడిస్తారు? అనే పలు సందేహాలు రాష్ట్రంలోని వందలాది మంది కానిస్టేబుళ్ల మెదళ్లను తొలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో శాంతిభద్రతల పరిరక్షణలో 24 గంటలు అహౌరాత్రులు శ్రమిస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్లకు కనీసం వారాంతపు సెలవు అయినా లేకపోవడం దురదృష్టకరమన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వెసులుబాటును తప్పని సరిగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చాక ఉన్నతాధికారులు మొదలుకుని కిందిస్థాయి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాన్నే ప్రత్యేకించి ప్రస్తావించారు. త్వరలోనే విధివిధానాలు రూపొందించి అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సాక్షాత్తూ సీఎం స్పందించి తమకు వారాంతపు సెలవులు అమలు చేస్తామనడంతో తమతో పాటు తమ కుటుంబసభ్యులూ ఆనందించారని అనేక మంది కానిస్టేబుళ్లు అన్నారు. 'ఇక దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూశాము. నెలలు, ఏడాదులు గడిచాయి. చివరికి ఐదేండ్లూ గడిచిపోయాయి కానీ ఇచ్చిన మాట మేరకు ఉత్తర్వులు మాత్రం రాలేద'ని మరి కొందరు కానిస్టేబుళ్లు వాపోయారు. 'పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా రాష్ట్రంలో పోలీసు సిబ్బంది సంఖ్య పెరగడం లేదు. పైపెచ్చు ఏటా రిటైరవుతున్న వారి సంఖ్య వందలలోనే ఉంటున్నది. వారి స్థానంలో సిబ్బంది రిక్రూట్మెంట్ జరడం లేదు. అయినప్పటికీ ఉన్న వారిపైనే పని భారం పడుతున్నది' అని వారు అన్నారు. ఈ స్థితిలో వారంలో ఒక్క రోజు సెలవు తీసుకుని ఇంట్లో కుటుంబసభ్యులతో గడిపితే మరుసటి రోజు ఉద్యోగానికి కొత్త ఉత్సాహంతో వెళ్తామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
శాఖను పర్యవేక్షించే ఐపీఎస్ అధికారులు మొదలుకుని ఇన్స్పెక్టర్ల వరకు వారికి అనువైన రీతిలో సెలవులు తీసుకోవడం, భార్యా పిల్లలతో విదేశాలకు వెళ్లి రావడం జరుగుతున్నదని, కానీ కింది స్థాయి సిబ్బందికి కనీసం వారంలో ఒక్క రోజూ సెలవు దొరకని పరిస్థితి ఉందని మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వరుసబెట్టి వచ్చిన అసెంబ్లీ, పార్లమెంటు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బందోబస్తులను ప్రశాంతంగా ముగిసేలా చేయడానికి తీవ్రంగా శ్రమించామనీ, ఈ స్థితిలో కొందరు ఐపీఎస్ అధికారులు చక్కగా సెలవులు పెట్టి విహార యాత్రలకు వెళ్లారని, అదే సమయంలో తాము మాత్రం నిరతర విధుల్లో కొనసాగుతూనే ఉన్నామని కొందరు రిజర్వు విభాగానికి చెందిన కానిస్టేబుళ్లు అన్నారు. అధికారులకు ఉన్న వెసులుబాట్లు, సౌకర్యాలను తాము ప్రశ్నించడం లేదనీ, కానీ తాము పడుతున్న శ్రమను కూడా గుర్తించి కొంతలో కొంత వారంలో ఒక రోజు సెలవు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటే సంతోషిస్తామని వారన్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం కానిస్టేబుళ్లకు వారాంతపు సెలవు సౌకర్యాన్ని వైఎస్ జగన్ మోహన్రెడ్డి కల్పించారనీ, దాంతో అక్కడి వారి కుటుంబసభ్యులు ఎంతో సంతోషంతో ఉన్నారని గుర్తు చేశారు. ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉన్నారు కాబట్టి సెలవు ఇస్తే సిబ్బంది సంఖ్య తగ్గి శాంతి భద్రతల పరిరక్షణకు సమస్యలు ఎదురవుతాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారనీ, ఇదే సిబ్బంది కొరతను ఏపీ లోనూ ఎదుర్కొంటున్నారు కదా? అని మరికొందరు సివిల్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి అత్యవసర పరిస్థితుల్లో సెలవులు పెట్టి వెళ్లిన వారిని సైతం వెంటనే విధుల్లోకి పిలుస్తారనీ, అలాగే వారాంతపు సెలవు ఉన్న వారిని సైతం పిలిచే అవకాశం ఉంది కదా అని వారంటున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పోరేషన్ ఉద్యోగుల మాదిరిగానే తమకూ వారాంతపు సెలవులివ్వాలని అనేక మంది కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులను కోరుతున్నారు. కాగా ఇప్పటికే ఈ సమస్యపై ఉన్నతాధికారులు దృష్టిని సారించారని త్వరలోనే కానిస్టేబుళ్లకు తీపి కబురు అందుతుందని మరో పక్క పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి అంటున్నారు. కానీ అది వాస్తవ రూపం దాల్చే వరకూ తమకు నమ్మకం లేదనే తీరులో అనేక మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. గతంలో నల్లగొండ ఎస్పీగా ప్రభాకర్రావు ఉన్న సమయంలో వారాంతపు సెలవులు ఇవ్వడాన్ని ఆ జిల్లా పోలీసులకు అమలు చేసి తర్వాత నిలిపి వేయడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.