Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డెర ప్రజాప్రతినిధుల సన్మాన సభలో టి.రాజయ్య
- వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలి : వేముల వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యతోనే అన్ని రంగాలపై పట్టు సాధ్యం అవుతుందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. వడ్డెర సామాజిక తరగతికి చెందిన మున్సిపల్ చైర్మెన్లు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మెన్లు, కార్పొరేటర్లను హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జాతీయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ..వడ్డెరలు తమ పిల్లలకు బాల్యవివాహాలు చేయవద్దని, పిల్లలను పనులకు పంపకుండా బడిపంపితే చదువుకుని అన్ని రంగాల్లో ఎదుగుతారని అన్నారు. మహిళలకు రాజకీయాధికారం ఇస్తే మెరుగైన అభివృద్ధి చేసిచూపుతారన్నారు. వడ్డెరలు ఆధునిక ఇంజినీర్లు అని కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ...బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు నామినేటెడ్ ఎమ్మెల్యేల పదవులు ఇచ్చినట్టుగానే వెనుకబడిన, ఇంతవరకు చట్టసభల్లో అడుగుపెట్టని సామాజిక తరగతులకు చెందిన వారికి ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అసెంబ్లీ, గోల్కొండ, చార్మినార్, ఆర్ట్స్ కళాశాల, తదితర అద్భుత చారిత్రక కట్టడాల నిర్మాణంలో వడ్డెరల పాత్ర మరువలేనిదని కొనియాడారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ..స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో వడ్డెరలు ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నారన్నారు. జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేశ్ మాట్లాడుతూ...సర్పంచ్గా మన్ననలు పొందగలిగితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు. వడ్డెర ప్రజాప్రతినిధుల సన్మాన సభ కార్యక్రమానికి ముగ్గురు మంత్రులను, స్పీకర్ను కలిసి ఆహ్వానిస్తే ఒక్కరు కూడా హాజరుకాకపోవడం బాధాకరమన్నారు. వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని, కొండలు, గుట్టలు, గనులపై హక్కులు కల్పించాలి డిమాండ్ చేశారు. వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని, రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కోరారు. వడ్డెర సామాజిక తరగతికి చెందిన పిల్లలందరికీ ఉచిత విద్యను అందించాలని కోరారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ వడ్డెరలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కోరారు. రామలింగం కళాబృందం ఆటపాటలు సభికులను ఉత్తేజపరిచాయి. జాతీయ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు మొగిలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, గౌరవాధ్యక్షులు ఆర్.లోకనాథం, ఉపాధ్యక్షులు పి.శ్రీధర్, కోశాధికారి బి.లక్ష్మీకాంతయ్య, మారయ్య, పాల్గొన్నారు.