Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
- 20 లీటర్ల కిరోసిన్ పోసి ఇంటికి నిప్పు
- గ్రామస్తులు కాపాడటంతో తప్పిన ప్రాణనష్టం
నవతెలంగాణ-పిట్లం
తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వనందుకు కలత చెందిన కుమారుడు.. ఓ రైతు కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కిరోసిన్ పోసి ఇంటికి నిప్పటించుకోగా, గమనించిన గ్రామస్తులు కాపాడటంతో ఈరబోయినబాయికాడి రాములు, భార్య, అతని ముగ్గురు పిల్లలకు ప్రాణాప్రాయం తప్పింది. ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఈరబోయినబాయికాడి సాయిలుకు ఇద్దరు కొడుకులున్నారు. పెద్దకుమారుడు రాములు, చిన్న కుమారుడు క్రిష్ణమూర్తి. తండ్రి పేరు మీద ఉన్న పదెకరాల భూమిని చిన్నకూమారుడు క్రిష్ణమూర్తి పేరుమీద రిజిస్టర్ చేయించాడు. దీంతో మనస్తాపానికి గురైన పెద్దకుమారుడు రాములు తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 20 లీటర్ల కిరోసిన్ కొనుక్కొని తెల్లవారుజామున ఇంటిపై చల్లి నిప్పటించాడు. ఇల్లు తగలబడి మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి నిచ్చెన సహాయంతో రాములు, అతని భార్య, ముగ్గురు పిల్లలను కాపాడారు. ఫైర్ఇంజన్కు ఫోన్ చేయగా, వాహనం వచ్చే సరికి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. బాన్సుబాడ సీఐ టాటాబాబు, రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ హాలీమ్, వీఆర్వో శ్రీనివాస్లు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామ పెద్దల సమక్షంలో రాములుకు రావాల్సిన భూమి వాటా తక్షణమే అతని పేరు మీదికి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లోని రూ.60వేల నగదు అగ్నికి ఆహుతి అయిందని, సుమారు నాలుగున్నర లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు అధికారులు పంచనామాలో పేర్కొన్నారు.