Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక్కడ జ్యుడీషియల్ కమిషన్ కోసం ఉద్యమిస్తాం
- మీరు సంపూర్ణ మద్దతు ఇవ్వండి
- కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తే వైఎస్ ఆత్మ క్షోభిస్తుంది: ఏపీ సీఎం జగన్కు భట్టి విక్రమార్క లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రాజెక్టుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని, ఇక్కడ కూడా ప్రాజెక్టు టెండర్లను విచారించేందుకు జ్యుడీషియల్ కమిషన్ కోసం ఉద్యమిస్తామని, అందుకు మీరు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టు టెండర్ల వివరాలను జ్యుడీషియల్ కమిషన్ ముందు పెడతామని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మీరు వస్తే మీ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం జగన్కు రాసిన బహిరంగలేఖ ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్, అవకతవకలకు పరోక్షంగా బాధ్యులు అవుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించనున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు అదనంగా చుక్క నీరు కూడా రాలేదని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆత్మగౌరవం, సామాజిక న్యాయం అనే పదాలకు అర్థాలే మారిపోయాయని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర శాసనభలో ఉప సభాపతిగా విభజన బిల్లును ప్రవేశపెట్టిన తాను కోట్లాది మంది ప్రజల ఆశలు నెరవేరతాయని ఆశించానన్నారు. కేసీఆర్ పాలన అందుకు భిన్నంగా జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 15శాతం కూడా పూర్తి చేయకుండా ప్రారంభోత్సవం చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ నుంచి గంధమల వరకు ఎంతమేరకు పనులు పూర్తి చేశారో చెప్పాలన్నారు. 15శాతం పనులకే రూ 50వేల కోట్లు వ్యయమైతే...మిగతా 85 శాతం పనులకు ఎన్ని వేల కోట్లు కావాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు బీజేపీ పార్టీయే ప్రత్యా మ్నాయం అనేది ఒక భ్రమనేనని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెర వేరుతాయన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భట్టి స్పందించారు. ఈ అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చించి దానిపై తమ నిర్ణయం ప్రకటిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.