Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనరిక్ మందులు వాడండి, మందుల ఖర్చు తగ్గించుకోండి: సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయ్ కుమార్
నవతెలంగాణ-మహబూబ్నగర్
నిత్యం కరువుతో అల్లాడుతున్న మహబూబ్నగర్ జిల్లాలో వైద్యం ఖరీదుగా మారిందని సుందరయ్య విజ్ఞానకేంద్రం కార్యదర్శి ఎస్.వినయ్ కుమార్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఎన్బీ శ్రీహరి జనరిక్ మెడికల్ షాపు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన క్యాంపును ప్రారంభించి మాట్లాడారు.. రెక్కాడితే గానీ డొక్కనిండని పాలమూరు, లాంటి కరువు జిల్లాలో వైద్యం పేదలకు అందనంత దూరంగా పోయిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న షుగర్, బీపీ, ఇతరత్రా రోగాలకు తక్కువ ఖర్చుతో లభించే జనరిక్ మందులను వాడాలని సూచించారు. బయట మార్కెట్లో వంద రూపాయలు ఖరీదయ్యే మందులు తమ జనరిక్ మెడికల్ షాపులో రూ.20లకే అందుబాటులో ఉన్నాయన్నారు. పేదలు, రిటైర్డ్ ఉద్యోగులు వీటిని కొనుగోలు చేయాలని సూచించారు. భవిష్యత్తులో గ్రామాల్లో కూడా ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్న ఆలోచన ఉందన్నారు. జనరిక్ మందులు వాడేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ఈ క్యాంపులో ఉచిత వైద్యసేవలు అందించిన వారిలో డాక్టర్ మైపాల్రెడ్డి, డాక్టర్ ఉదరు, డాక్టర్ శరత్, డాక్టర్ శిరిషతో పాటు సుజావతి, కృష్ణ ప్రసాద్, శంకర్ ఉన్నారు.