Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన రైతులందరికీ రైతుబంధు అమలుచేయాలి: ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-మహబూబ్నగర్ప్రతినిధి
రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి, అర్హులైన రైతులందరికీ రైతుబంధు అమలు చేయాలని ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాన్గల్ మండలం రేముద్దుల గ్రామంలో 'వ్యవసాయ రంగం-సంస్కరణలు' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సారంపల్లి మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమీసంహారక మందులు ఉచితంగా ఇస్తున్నారనీ, ఆయా దేశ బడ్జెట్లో 10శాతం వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నారనీ వివరించారు. మన దేశంలో రెండు శాతం వ్యవసాయ రంగానికి కేటాయించి బీజేపీ ప్రభుత్వం రైతుల మీద తమ కపట ప్రేమను చూపుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1982 పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయిస్తున్నాయన్నారు. కానీ మార్కెట్ వారు నిర్ణయించి దాని కంటే క్వింటాకు రూ.300 నుంచి 600 తక్కువ తీసుకుంటున్నారనీ, దీనివల్ల దళారులకు రూ.8500 కోట్లు లాభాలు వచ్చినట్టు మాజీ కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ప్రకటించారని గుర్తుచేశారు. అర్హులైన రైతులందరికీ భూమి పట్టాలిచ్చి రైతుబంధు అమలు చేయాలన్నారు. స్టేట్ ఫైనాన్స్ ప్రకారం ప్రభుత్వ సహకార బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలన్నారు. నకిలీ, బీటీ 3 విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులందరికీ రైతు బంధు అమలు చేయాలని, ఖరీఫ్ ప్రణాళికను వెంటనే విడుదల చేయాలని, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు 2006 అటవి హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని, మార్కెట్ స్థిరీకరణ నిధి రూ.4000 కోట్లు కేటాయించాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, భూ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెమినార్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్డి జబ్బార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల్రెడ్డి, రైతు సంఘం నాయకులు మహబూబ్పాష, గోపి, కోదండ రాములు, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు వెంకటగోపాల్ పాల్గొన్నారు.