Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణం
- కార్మికుల ఉపాధికి కృషి చేయాలి: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారావు
నవతెలంగాణ-కంఠేశ్వర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల బీడీ కార్మికులకు పని దినాలు తగ్గి పరిశ్రమ రోజురోజుకు కుంచించుకుపోతోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారావు అన్నారు. తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ద్వితీయ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజారావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించకుండా బీడీ పరిశ్రమను మూసివేయాలనుకోవడం సరైంది కాదన్నారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందుకోసం కోసం రాష్ట్ర మహాసభల్లో నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ మాట్లాడుతూ.. బీడీ కార్మికుల అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం జీవనభృతిని ప్రకటించిందనీ, అయినా ఇంకా అనేకమందికి అందడంలేదనీ అన్నారు. ప్రభుత్వాలు బీడీ యజమానులకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. బీడీ కార్మికుల సమస్యలపై మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, అధ్యక్షులు వై గంగాధర్, పి వెంకటేష్, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.