Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడవి బిడ్డలు మనుషులే..
- టి. సర్కార్పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: ఆదివాసీలకు కూడా హక్కులుంటాయి. అడవిని ఆక్రమించుకున్నారంటూ.. చెప్పాపెట్టకుండా అడవి నుంచి వారిని తరలించడం ఎంతవరకూ న్యాయం. పునరావాస చర్యలు తీసుకున్నాకే వాళ్లని అడవి నుంచి తరలించాల్సింది. వాళ్లూ మనుషులే. జంతువుల్లా ఫారెస్ట్ రేంజి డిపోలో ఉంచుతారా..? అని తెలంగాణ సర్కార్పై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొమురం భీమ్ జిల్లా కాగజ్నగర్ మండలం కొలంగొండి గ్రామానికి చెందిన 67 మంది గిరిజనులకు పునరావాస చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ను ఆదేశించింది. ప్రభుత్వం ఎంపిక చేశామని చెబుతున్న 91 ఎకరాల భూమిని 67 మందికి ఆరు మాసాల్లోగా ఇవ్వాలనీ, ఏడాదిలోగా శాశ్వతంగా ఇండ్లను నిర్మించాలనీ, వారి జీవనోపాధికి సంబంధించిన పశుల్ని తిరిగి ఇచ్చే ఏర్పాట్లు చేయాలనీ హైకోర్టు ఆదేశించింది. ఇవన్నీ చేసే వరకూ ప్రభుత్వం చెబుతున్నట్లుగా వాంకెడిలోని ప్రభుత్వ హాస్టల్లో వసతి కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఉన్న అటవీ ప్రాంతంలోనే ఉండేందుకు అనుమతించాలని పిటిసనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అడవిని ఖాళీ చేయించే పేరుతో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు గిరిజనులను బలవంతంగా బయటకు పంపేస్తున్నారనీ,కొమురం భీమ్ జిల్లా కాగజ్నగర్ మండలం కొలంగొండిలో ఏకంగా 67 మంది గిరిజనులను అటవీ శాఖ టింబర్ డిపోలో చట్ట వ్యతిరేకంగా నిర్బంధించారని దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ను ఆదివారం సాయంత్రం విచారించిన హైకోర్టు పైవిధంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆజిల్లా కలెక్టర్, ఐటీడీఏ, ఇరిగేషన్ శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ కుటుంబాలకు చెందిన 16 మంది పెద్దలను ఆదివారం హైకోర్టులో హాజరుపర్చాలన్న ఉత్తర్వుల మేరకు ఫారెస్ట్ అధికారులు టూరిజం శాఖ వాహనంలో తీసుకువచ్చి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట హాజరుపర్చారు.. సిడెం పువా, ఆత్రం భీములు తమ పట్ల ఫారెస్ట్ అధికారులు వ్యవహరించిన తీరును బెంచ్కు వివరించారు. తాము దేవుడికి పూజ చేసేందుకు వెళ్లినప్పుడు అధికారులు వచ్చి ఇండ్లు, పశులపాకల్ని పీకేశారని, 67 మందిని ఫారెస్ట్ డిపోలో ఉండారని చెప్పారు. ఫారెస్ట్ డిపోలో 67 గిరిజన కుటుంబాల్ని ఈ నెల 12 నుంచి చట్ట వ్యతిరేకంగా అక్రమ నిర్బంధం చేశారని, వారి హక్కుల్ని దెబ్బతీసేలా అటవీ అధికారుల చర్యలున్నాయని పేర్కొంటూ తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి తన ఇంటి వద్ద శనివారం అత్యవసరంగా విచారించింది. గిరిజనుల ఇండ్లను కూల్చేశారనీ, ఉపాధి లేకుండా చేసే చర్యలో భాగంగా సాగు చేసుకోనీయడం లేదని, పశుల కొట్టాలను కూడా పీకేశారని పిటిసనర్ లాయర్ రఘునాథ్ చెప్పారు. 'బాధితులైన ఆదివాసీలు అడవిలో భూమిని సాగు చేసుకోనీయకుండా అడ్డుకోవడం ద్వారా వారి జీవనాధారాన్ని దెబ్బతీశారు. ఇండ్లనే కాకుండా పశువుల పాకల్ని నేలమట్టం చేశారు. పశువుల ఎక్కడున్నాయో కూడా బాధితులకు తెలియదు. ఆదివాసీయుల పట్ల కర్కసంగా వ్యవహరించారు. పశువుల కంటే హీనంగా పరిగణించారు. ఆదివాసీయులంతా మహారాష్ట్ర నుంచి వలస వచ్చారని, తిరిగి వాళ్లను బలవంతంగా మహారాష్ట్రకు వెళ్లిపోవాలని వేధిస్తున్నారు. బాధితులను కొలంగొండి అటవీ ప్రాంతం నుంచి పంపించడమే లక్ష్యంగా మానవహక్కుల్ని కాలరాస్తున్నారు. అందుకే వారందరినీ వేంపల్లి ఫారెస్ట్ టింబర్ డిపోలో ఈ నెల 12 నుంచి అక్రమంగా నిర్బంధించారు...'అని పిటిషనర్ న్యాయవాది చెప్పారు.
వేరే ప్రాంతాల నుంచి అటవీ ప్రాంతంలోకి వచ్చి గుడిసెలు వేసుకున్నారని, అదంతా రిజర్వుడు ఫారెస్ట్ అని ప్రభుత్వ లాయర్ మనోజ్ చెప్పారు. వారందరికీ పునరావాస చర్యలు తీసుకుంటున్నామనీ, 91 ఎకరాలను ఎంపిక చేశామని, ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పునరావాసం కల్పించకుండానే ఎందుకు వాళ్లందరినీ తరలించారని ప్రశ్నించింది. అనంతరం డివిజన్ బెంచ్.. ఆరు మాసాల్లోగా భూమి కేటాయించాలి. సాగుకు అవసరమైన బోర్లు, ఇతర సౌకరాల్ని కల్పించాలి. వాళ్ల పశుల్ని తిరిగి ఇవ్వాలి. ఏడాదిలోగా ఇండ్లను నిర్మించి ఇవ్వాలి. అప్పటి వరకూ వాంకెడి హాస్టల్లోనే ఉంచి ఆహారం, వసతి, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ ఆదేశాలు అమలు చేయకపోతే పిటిషనర్లుగానీ బాధితులుగానీ కోర్టు ధిక్కార రిట్ దాఖలు చేసుకునే అధికారం ఉంది.. అని ఉత్తర్వులు జారీ చేసింది.