Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తిస్థాయిలో చేరని సబ్సిడీ విత్తనాలు
- వరి, సోయా, మొక్కజొన్నకు డిమాండ్
- ఇప్పటిదాకా వరి విత్తనాల పంపిణీ అంతంతే..
- ప్రతిపాదిత మోతాదు కంటే తక్కువ సరఫరా
- మరోవైపు తొలకరి పలకరించక రైతుల అనాసక్తి
సాగు అంచనా మేరకు ప్రణాళికలు రూపొందించినా.. సబ్సిడీ విత్తనాల విషయంలో ఆ దిశగా చర్యలు కొనసాగడం లేదు. ఖరీఫ్లో భాగంగా విత్తనాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్టు అధికారులు ప్రకటిస్తున్నా.. రైతుల అవసరానికి తగ్గ విత్తనాలు అందుబాటులో లేవు. కొన్నిజిల్లాల్లో ప్రతిపాదిత క్వింటాళ్ల కంటే తక్కువ సరఫరా చేసి చేతులు దులుపుకున్నారు. సోయా, మొక్కజొన్న, అపరాల వంటి విత్తనాల్లోనూ సరైన అంచనాల్లేవని తెలుస్తున్నది. అయితే వర్షాలు కురిసిన తర్వాత విత్తుకోవాలని అధికారులు సూచనలిస్తున్నా.. ఒక్కసారిగా వానలు ఊపందుకుంటే మాత్రం విత్తనాలు అందక రైతులు దిక్కుతోచని స్థితిలో పడే అవకాశమున్నది. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలు సరిపోక రైతులు గంటలు, రోజుల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు.
నవతెలంగాణ-మొఫిసిల్ యంత్రాంగం
రైతుకు అవసరమైన విత్తనాలన్నీ సిద్ధం చేశామంటున్నది టీఆర్ఎస్ సర్కార్. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 7.5 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అవసరమని ప్రతిపాదించింది. 1,115 నోటిఫైడ్ షాపుల ద్వారా వీటిని విక్రయించేలా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్ఎస్డీసీ) ప్రకటించింది. అధికారులు వేసే లెక్కలు కాగితాలకే పరిమితమవుతున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా..సబ్సిడీ విత్తనాల పంపిణీలో ప్రతియేటా సమస్యలు తలెత్తడం పరిపాటిగా మారింది. సరిపడా విత్తనాలు
అందుబాటులో లేకపోవడం, సకాలంలో పంపిణీ చేయకపోవడం, నిబంధనలు విధించడం వంటి ఇబ్బందులు నిత్యం రైతుకు ఎదురవుతూనే ఉన్నాయి. సబ్సిడీ గింజలు అందుకునేందుకు అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీకావు. జూన్ మాసంలో అడుగుపెట్టినా..నైరుతి రుతుపవనాలు ముఖం చేటేశాయి. దీంతో ఇప్పటిదాకా వర్షాలు పడలేదు. ఇప్పటికీ విత్తనాల పంపిణీ ఊపందుకోలేదు. అయినప్పటికీ గత మూడ్రోజుల క్రితం నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధి, కుబీర్ మండలంలో రైతులు ఒక్కసారిగా బారులు తీరడంతో విత్తన కష్టాలు షురయ్యాయి. ఒకే కేంద్రం ఏర్పాటు చేయడంతో 16 గ్రామాల రైతులకు అందజేయడం గగనంగా మారింది. అయితే కొన్నిజిల్లాలకు సబ్సిడీ విత్తనాలు సరిపడా కేటాయించకలేదు. దీంతో వచ్చే పది రోజుల్లో అన్నదాతలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్లో 4,41,735 ఎకరాల్లో సాగు అంచనాలు సిద్ధం చేయగా.. 2,25,540 ఎకరాల్లో వరి, 1,12,250 ఎకరాల్లో సోయాబీన్ సాగయ్యే అవకాశమున్నట్టు ప్రతిపాదించారు. కానీ సాగుకు అవసరమైన మేర సబ్సిడీ విత్తనాల సరఫరా కాలేదు. నిజామాబాద్ జిల్లాలో సోయాబీన్ 30 వేల క్వింటాళ్లు అవసరం కాగా.. 17081 క్వింటాళ్లు మాత్రమే స్టాక్ నిల్వ ఉంది. ఇప్పటివరకు 3,737 క్వింటాళ్ల విత్తనాలు అమ్మకాలు జరిగాయి. వరికి సంబంధించి 30 వేల క్వింటాళ్లు అవసరం కాగా 15,298 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 6589 క్వింటాళ్ల అమ్మకం జరిపారు.
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 4,26,009 ఎకరాల్లో పంట సాగుకు వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధంచేయగా.. వరి 1,35,907, సోయాబీన్ 1,01,313 ఎకరాల్లో ప్రణాళికలు వేశారు. వరి విత్తనాలు 35 క్వింటాళ్లు అవసరం కాగా కేటాయించిన పరిమాణం తక్కువగా ఉంది. కేవలం 15 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే కేటాయించారు. సోయాబీన్కు 45 వేల క్వింటాళ్లకుగాను 40వేల క్వింటాళ్లు కేటాయించారు. నల్లగొండ జిల్లాలో 72,500 క్వింటాళ్ల లక్ష్యంకాగా 10వేల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. పత్తి 11 లక్షలా 5 వేల ప్యాకెట్లకుగాను అసలేమీ అందుబాటులో లేవు. వర్షాలు లేకపోవడంతో రైతులు విత్తనాల కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పత్తి గింజలు అందుబాటులో లేకపోవడంతో అక్కడక్కడ దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. కరీంనగర్ జిల్లాలో సాగు లక్ష్యం లక్షా 37 వేలా 500 ఎకరాలు కాగా 34,375 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని గుర్తించారు. 15వేల క్వింటాళ్లు మాత్రమే మంజూరుకాగా జిల్లాలో ఇప్పటివరకు 8,201 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. ఇందులో 2,895 క్వింటాళ్లు రైతులకు అందించారు. మొక్కజొన్న విత్తనాలు ఇప్పటిదాకా జిల్లాకు రాలేదు.
నిర్మల్ జిల్లాలో 12 వేల హెక్టార్ల సాధారణ వరి విస్తీర్ణం కాగా ఈ ఖరీఫ్లో 15 వేల హెక్టార్లలో వరిని సాగు చేయనున్నారని అంచనా వేశారు. మార్కెట్లో 1010, కేఎన్ఎం-118 రకాల వరి రకాలు అందుబాటులో ఉన్నాయి. 3వేలా 104 క్వింటాళ్ల విత్తనాల లక్ష్యం పెట్టుకోగా పూర్తిస్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 800 క్వింటాళ్లకుపైగా పంపిణీ చేశారు. సోయా 56,597 క్వింటాళ్ల విత్తనాలు అవసరంకాగా 40 వేల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ చేశారు. విక్రయ కేంద్రాలకు రోజుకు కనీసం 600 మంది వరకు రైతులు పడిగాపులు గాస్తున్నారు. ముఖ్యంగా ముథోల్, భైంసా ప్రాంతాల్లో ఈ సమస్య తలెత్తుతోంది. జగిత్యాల జిల్లాలో 46,220 హెక్టార్లుగా అంచనా వేయగా.. వరి రకాల విత్తనాలు 3043 క్వింటాలు, సోయా 1625 క్వింటాలు ఇప్పటివరకు వచ్చాయి. అయితే జిల్లాకు ఎంత మేర విత్తనాలు అవసరం.. లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇంకెన్ని విత్తనాలు అవసరమో అధికారులు గుర్తించలేదు.. నాలుగైదు జిల్లాల్లోనే సబ్సిడీ విత్తనాల పరిస్థితి ఇలా ఉంటే...రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన విత్తనాలు ఎప్పుడు సరఫరా చేస్తారు..? జిల్లాల వారీగా చేరెటప్పటికీ అన్నదాతలు ఎలాంటి కష్టాలు వస్తాయోనన్న విషయం పై విత్తనాభివృద్ధి సంస్థ లైట్గా తీసుకుంటున్నదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.