Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రానికి చెందిన కొందరు పోలీసు అధికారులు ఆంధ్రప్రదేశ్ కేడర్లోకి మారడానికి ఆసక్తిని చూపుతున్నారని తెలిసింది. దీనికి సంబంధించి వారు అంతర్గతంగా అక్కడున్న సీనియర్ అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలిసింది. ఈ విధంగా ఏపీకి వెళ్లడానికి ఆసక్తిని చూపిస్తున్నవారిలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నట్టు సమాచారం. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ రీజియన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్గా కోరి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో స్టీఫెన్ను అంతర్ రాష్ట్ర ఐపీఎస్ అధికారుల డిప్యూటేషన్ కింద ఏపీకి పంపించడానికి రాష్ట్ర సర్కారు సైతం అంగీకరించింది. అయితే అదే దారిలో మరికొందరు అధికారులనూ ఏపీకి తీసుకువెళ్లడానికి అక్కడి సర్కారు సైతం ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు సైతం ఏపీ వైపు చూస్తున్నారని తెలిసింది. ఇందులో ఒకరు అదనపు డీజీ స్థాయి అధికారి, మరోకరు ఐజీ స్థాయి అధికారి ఉన్నట్టుగా ఐపీఎస్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ ఇద్దరు అధికారులకు ఆయనతో మంచి సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ సీఎం కావడంతో ఆ సంబంధాల కారణంగానే వారు అక్కడికి వెళ్లాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరికొందరు అదనపు ఎస్పీలు, నాన్కేడర్ ఎస్పీలు కూడా ఏపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులతో ఉన్న సత్సంబంధాలతో పాటు అక్కడ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏండ్లు ఉండటం, తాము అక్కడికి వెళితే ప్రాధాన్యత కలిగిన పోస్టులు లభిస్తాయనే ఆశ.. కలిపి ఏపీ వైపునకు వెళ్లేలా వారిలో ఆసక్తిని పెంచుతున్నట్టు తెలిసింది. కాగా ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య డీఎస్పీ మొదలుకొని నాన్కేడర్ ఎస్పీ స్థాయి వరకూ అధికారుల విభజన జరగకపోవడం, ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయాలని ఎన్నికల ముందు ఇరు రాష్ట్రాల డీజీపీలు సమావేశమై నిర్ణయించడం జరిగింది. ఎన్నికల తర్వాత అక్కడ ప్రభుత్వంతో పాటు డీజీపీ కూడా మారడం, ప్రస్తుతం కొత్త డీజీపీ గౌతమ్సవాంగ్ చేతిలో అక్కడి పోలీసు పగ్గాలు ఉన్నాయి. దీంతో ఏపీ నూతన డీజీపీతో తిరిగి సమావేశం కావడమాణ? లేక ఇదివరకు తీసుకున్న నిర్ణయం మేరకు ప్రక్రియను ముందుకు కొనసాగించేలా కోరడమా? అనే విషయమై రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇదే జరిగితే ఏపీకి వెళ్లాలని ఆసక్తిని చూపిస్తున్న కొందరు అదనపు ఎస్పీలు, ఎస్పీలు తమ విల్లింగ్ను ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలిసింది.