Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలమూరు-రంగారెడ్డి భూనిర్వాసితుల ఆవేదన
- హామీ విస్మరించిన ఎమ్మెల్యే మర్రి
- మళ్లీ పాదయాత్రగా ప్రగతిభవన్కు..
- జడ్చర్లలోని నాగసాల వద్ద అడ్డుకున్న పోలీసులు
- వాగ్వాదం, తోపులాటల మధ్య 70 మంది అరెస్ట్
నవతెలంగాణ- జడ్చర్ల
'మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక న్యాయం.. మాకు మరో న్యాయమా. ఎమ్మెల్యే మర్రి హామీ ఇచ్చి విస్మరించారు' అంటూ పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులు నినదించారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు పరిహారం పెంచినట్టుగానే తమకూ చెల్లించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 20 రోజుల కింద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూ నిర్వాసితులు చేపట్టిన పాదయాత్రను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి హామీతో విరమించిన విషయం విదితమే. 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పత్తా లేకపోవడంతో నిర్వాసితులు మరోమారు 'చలో ప్రగతిభవన'్కు పిలుపునిచ్చారు. సోమవారం పోలీసుల ఆంక్షల మధ్య నాగర్కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం వట్టెం నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాల వద్దకు చేరుకోగానే పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగింది. మహబూబ్గర్ డీఎస్పీ భాస్కర్గౌడ్ రంగంలోకి దిగి రైతులను ఎక్కడికక్కడా అరెస్టు చేసి వాహనాల్లో తరలించారు.
న్యాయమైన పరిహారం కోసం శాంతియుతంగా పాదయాత్ర చేపడితే అడ్డుకొని అరెస్టు చేయడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయాయని వాపోయారు. న్యాయం కోసం పాదయాత్ర ప్రారంభిస్తే అడ్డుకోవడం అన్యాయమన్నారు. 20 రోజుల కింద చలో ప్రగతిభవన్ పేరున పాదయాత్ర చేపడితే.. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే హామీ ప్రకారం వాయిదా వేసుకున్న కార్యక్రమాన్ని ఆయన నిలబెట్టుకోకపోవడం వల్లే మళ్లీ ఆందోళనకు సిద్ధపడాల్సి వచ్చిందని చెప్పారు. రైతులతో రాజకీయాలు చేయాలని చూస్తే ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతాదని హెచ్చరించారు.
తొందరగా సమస్యలు పరిష్కరించకపోతే మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో తెలంగాణ రైతు సంఘం నాయకులు బాలకృష్ణతో పాటు దాదాపు 70 మంది నిర్వాసితులు ఉన్నారు. వీరిలో కొంతమందిని తిమ్మాజిపేట, జడ్చర్ల, మిడ్జిల్, బాల్నగర్ పోలీస్స్టేషన్లకు తరలించారు. అయినా మరికొందరు నిర్వాసితులు వెనుకడుగు వేయకుండా పాదయాత్రగా బయలుదేరారు.