Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిరాయింపుల ప్రోత్సాహకం అప్రజాస్వామికం:
- మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
నవతెలంగాణ-గోదావరిఖని/పెద్దపల్లి
ప్రభుత్వం ఓపెన్కాస్ట్లను ఏర్పాటు చేసి పారిశ్రామిక ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చుతున్నదని మంథని ఎమ్మెల్యే శ్రీదర్బాబు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ వస్తే ఓసీపీలను రద్దు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి మరచారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని 5వ బొగ్గు గని మూసేసి ఓపెన్కాస్ట్-5గా మార్చొద్దంటూ సోమవారం ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుతో పర్యావరణం దెబ్బతింటుందన్నారు. భూగర్భ గనులకు ప్రాధాన్యత ఇచ్చిన ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సీఎం మాయమాటలు చెప్పి ఇప్పుడు ఓసీపీలను ప్రారంభించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఓసీపీలలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసీపీ-5 ఏర్పాటులతో గోదావరిఖని పట్టణం విధ్వంసానికి గురవుతాదన్నారు. పదవి రాకముందు ప్రాణం కన్నా కార్మికులు ముఖ్యమన్న రామగుండం ఎమ్మెల్యే చందర్ ఇప్పుడు ఓసీపీ-5 ఏర్పాటును ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాంత వాసి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒకప్పుడు సింగరేణి కార్మికుడేనని, తట్టా, చెమ్మా పట్టినవాడే కదా ఓసీపీ-5 ఏర్పాటుపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఓసీపీ నిర్మాణం నిలిపివేయకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
దుర్మార్గపు ఆలోచనలో సీఎం: ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను మరుగున పడేసి, ప్రతిపక్షమే ఉండకూడదనే దుర్మార్గమైన ఆలోచనతో సీఎం కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన, ఎమ్మెల్యే శ్రీధర్బాబు మాట్లాడారు. వయస్సులో చిన్నవాడైనా ఏపీ ముఖ్యమంత్రి జగన్.. తన పార్టీలోకి వచ్చే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ముందు పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారని గుర్తు చేశారు. ఆయనను చూసైనా సీఎం కేసీఆర్కు కనువిప్పు కలగాలన్నారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చేరేందుకు ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశపరీక్ష ఉండటంతో పేద విద్యార్థులకు సీట్లు రావడం లేదన్నారు. వెంటనే టీఆర్టీ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు పార్టీ ఫిరాయింపును టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొంరయ్య, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు.