Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాసమస్యలపై అధ్యయనం చేయాలి
- సైద్ధాంతిక రాజకీయ అవగాహనను పెంచాలి: ఎస్ఎఫ్ఐ శిక్షణా తరగతుల్లో కె నాగేశ్వర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సామాజిక అణచివేత, ఆర్థిక దోపిడీ, అసమానతల్లేని సమాజ మార్పు కోసం ఉద్యమించాలని మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ పిలుపునిచ్చారు. మూడు రోజులపాటు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర విద్యావైజ్ఞానిక శిక్షణా తరగతులను సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై నిర్దిష్టంగా అధ్యయనం చేయాలని సూచించారు. రోజువారీ సమస్యలతోపాటు విద్యారంగంలో వస్తున్న మార్పులపైనా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యారంగంతోపాటు ఆర్థిక, రాజకీయ రంగాల్లో వస్తున్న మార్పులు, ప్రభుత్వాలు చేపడుతున్న విధానాలపై చర్చించాలని చెప్పారు. ఎస్ఎఫ్ఐ నినాదం అధ్యయనం, పోరాటం అన్న పదాలకు ఎంతో విలువ ఉందన్నారు. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాల సాధన కోసం విద్యార్థుల్లో అవగాహన పెంచాలని సూచించారు. విద్యారంగ సమస్యలపై పోరాడుతూనే సైద్ధాంతిక రాజకీయ అవగాహన పెంచితేనే విద్యార్థులు చిరకాలం ఆ భావజాలంతో ఉంటారని చెప్పారు. విద్యారంగ సమస్యలపై విద్యార్థులను కదిలించి రాజకీయ చైతన్యాన్ని పెంచాలని అన్నారు. ఆన్లైన్లో చేసే ఉద్యమం భౌతిక ఉద్యమాలకు ప్రత్యామ్నాయం కాదన్నారు. భౌతికంగా చేసే ఉద్యమాలతోపాటు సోషల్ మీడియాను వినియోగించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు. ఎక్కువ మంది విద్యార్థులను ప్రభావితం చేసేందుకు భావజాలం వ్యాప్తికి సోషల్ మీడియా దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి కోట రమేష్, ఉపాధ్యక్షులు తాటికొండ రవి, రజిని, కె విజేత, ఎస్ రజినీకాంత్, జావీద్, రామకృష్ణ, ప్రకాశ్కరత్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.