Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా సమస్యలు పరిష్కరించండి : కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య లను పరిష్కరించాలని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఎ అశోక్ ను సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. పదేండ్లుగా బదిలీల అవకాశం లేక నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు. 2000 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తమ సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. కోర్టు పేరుతో కాలయాపన అవుతోందని పేర్కొన్నారు. కనీసం ప్రభుత్వ పరిధిలోని సమస్యలనూ పరిష్కరించడం లేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 ఖాళీలున్నాయని పేర్కొన్నారు. అయినా బదిలీలు చేపట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 500, 600 కిలోమీటర్ల దూరంలో కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలను మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. అనారోగ్య సమస్యలున్నా బదిలీలు చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా జీతాల్లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, సురేష్బాబు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.