Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎమ్యూ డిమాండ్
- 25న డిపోలు, యూనిట్ల వద్ద ధర్నాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థని (టీఎస్ఆర్టీసీ) రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎమ్యూ) డిమాండ్ చేసింది. 2014లోనే టీఎస్ఆర్టీసీ విలీన డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఆ తర్వాత మిన్నకుండిపోయిందని తెలిపారు. సోమవారంనాడు బస్భవన్లోని టీఎమ్యూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం అధ్యక్ష, కార్యనిర్వాహక, ప్రధాన కార్యదర్శులు వీ తిరుపతి, ఎమ్ థామస్రెడ్డి, ఇ అశ్వత్ధామరెడ్డి మాట్లాడారు. పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ విలీన ప్రకటన చేయాలని కోరారు. ప్రస్తుతం ఆర్టీసీలో 1960 నాటి రెగ్యులేషన్స్ అమలవుతున్నాయని, తాజా ప్రాంతీయ పరిస్థితుల్ని బట్టి వాటిని మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం జరిగితే కార్మికులకు ఉద్యోగభద్రత ఉంటుందని, అద్దె బస్సుల నష్టాలను వదిలించుకొనేందుకు ప్రభుత్వం వాటిని దూరంగా పెడుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీకి రావల్సిన రీయింబర్స్మెంట్ను ప్రతి మూడునెలలకు చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని ఆందోళన వ్యక్తంచేశారు. 2017 తుది వేతన సవరణ ప్రకటించాలని, డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని, ఖాళీలు భర్తీచేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు సకలజనుల సమ్మె వేతనాన్ని చెల్లించాలని, 2019 జనవరి 1 నుంచి పాతబకాయిలతో సహా డీఏ చెల్లించాలని, 2014 నుంచి 2018 వరకు రావల్సిన లీవ్ఎన్క్యాష్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులతో యాజమాన్యం చేసుకున్న ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదని, ఏడాది కాలంగా సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ లేరని, ఫలితంగా పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. సీసీఎస్, పీఎఫ్, ఎస్ఆర్బీఎస్ నిధులు విడుదల చేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధనకై ఈనెల 25 రాష్ట్రంలోని అన్ని డిపోలు, యూనిట్ల వద్ద ఎర్రబ్యాడ్జీలు ధరించి, ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిస్పందనను బట్టి, దశలవారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.