Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటర్ట్యాంక్, ఐటీడీఏ భవనం ఎక్కి నిరసనలు
నవతెలంగాణ-భద్రాచలం/చండ్రుగొండ/ మరిపెడ
సమస్యల పరిష్కారం కోసం భద్రాద్రి జిల్లా భద్రాచలంలో సీఆర్టీలు ఐటీడీఏ భవనం ఎక్కారు.. చండ్రుగొండలో ఆదివాసీలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అలాగే, మహబూబాబాద్ జిల్లాలో భూసమస్య పరిష్కరించాలంటూ రైతు వాటర్ట్యాంక్ ఎక్కి సోమవారం ఆందోళనకు దిగాడు.
పదేండ్లుగా తాము ఐటీడీఏ విద్యాసంస్థల్లో సీఆర్టీలుగా పనిచేస్తున్నామని, 2019-20 సంవత్సరానికిగానూ రెన్యూవల్ చేయకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల సర్వీస్ నష్టపోతున్నామని భద్రాచలంలో ఆందోళన చేశారు. ఐటీడీఏ అధికారు ల మొండి వైఖరిని నిరసిస్తూ భవనం ఎక్కి పెట్రోల్ బాటిళ్లతో నిరసన తెలిపారు. పీవో గౌతమ్ వారి వద్దకు వెళ్లి కొత్త నోటిఫికేషన్ను వారం రోజులపాటు నిలిపేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో ఆందోళన విరమించారు. అర్హత కలిగిన వారికి రైతుబంధు, రైతుబీమా వర్తింపజేయాలని కోరుతూ ఆదివాసీలు ఎనిమిది రోజులుగా చండ్రుగొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్నారు. అయినా, అధికారులు స్పందించకపోవడంతో కార్యాలయం ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. దాంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తహసీల్దార్ రాధిక అక్కడికి చేరుకొని ఆదివాసీలతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాల్టీ పరిధిలోని ఆర్లగడ్డ తండాకు చెందిన గిరిజన రైతు దామా నాయక్ తన వ్యవసాయ భూమికి వెళ్లడానికి ఉన్న డొంకను మరో రైతు కబ్జా చేశాడని అధికారులను ఆశ్రయించాడు. వాళ్లు పట్టించుకోకపోవడంతో మరిపెడ మండల కార్యాలయం ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. సీఐ కరుణాకర్, ఫైర్, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని రైతు దామా నాయక్ను సముదాయించి కిందికి దింపారు.